టిడిపిలో చేరిన ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ బీసీ సెల్ కోఆర్డినేటర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ బీసీ సెల్ కోఆర్డినేటర్ జి. నాగరాజు యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ సమక్షంలో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నాగరాజు యాదవ్ మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావం నుండి తాను పార్టీలో ఉన్నప్పటికీ అవమానాలే పడ్డానన్నారు. వైసీపీలో బీసీలకు ప్రాధాన్యత లేదన్నారు. ప్రజాసేవ కోసం పరితపిస్తున్న టి.జి భరత్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. టి.జి భరత్ విజయం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భరత్ మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావం నుండి ఉన్న నేతలకు సైతం ఆ పార్టీలో న్యాయం జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తామని చెప్పుకుంటున్నారే కానీ చేతల్లో మాత్రం అలా జరగడం లేదన్నారు. కేవలం పదవులిచ్చి పవర్ లేకుండా చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ నుండి తమ పార్టీలోకి చేరుతున్న నాయకులు ఎలాంటి కండిషన్లు లేకుండా స్వచ్చందంగా వస్తున్నట్లు తెలిపారు. బీసీలంటేనే టిడిపి అన్నారు. ఈ ఐదేళ్లలో జరిగిన పరిస్థితులు అందరూ గ్రహిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని టి.జి భరత్ తెలిపారు. పార్టీలో చేరిన వారిలో సిటీ సేవాదల్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ, ప్రవీణ్, శేఖర్, సురేష్, ఇక్బాల్, వేణు, నాసిర్, మౌలాలి, ఖాదర్, ఇంతియాజ్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జమీలా బేగం, తదితరులు పాల్గొన్నారు.