PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూల్లోని మాదిగ‌లంద‌రూ టి.జి భ‌ర‌త్‌ను గెలిపించాలి..

1 min read

ఎమ్మార్పీఎస్ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు మంద‌క్రిష్ణ మాదిగ‌

టి.జి భ‌ర‌త్‌తో స‌మావేశ‌మైన మందక్రిష్ణ‌

టి.జి కుటుంబం రుణం తీర్చుకునే స‌మ‌యం వ‌చ్చింద‌ని పిలుపునిచ్చిన మంద‌క్రిష్ణ‌

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎమ్మార్పీఎస్ జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సంపూర్ణ స‌హ‌కారం అందించిన టి.జి కుటుంబం రుణం తీర్చుకునే స‌మ‌యం వ‌చ్చింద‌ని ఎమ్మార్పీఎస్ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు మంద‌క్రిష్ణ మాదిగ అన్నారు. క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్‌ను ఆయ‌న కార్యాల‌యంలో మంద‌క్రిష్ణ మాదిగ క‌లిసి మాట్లాడారు. ఎన్నిక‌ల్లో కూట‌మి గెలుపు కోసం కృషి చేస్తామ‌ని చెప్పారు. అనంత‌రం మంద‌క్రిష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి.. టిడిపి, జ‌న‌సేన, బీజేపీ కూట‌మిని బ‌ల‌ప‌రుస్తుందన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం మొద‌లుపెట్టిన రోజుల్లో ఉద్యమాన్ని ముందుకు న‌డిపించేందుకు సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ రాజ్యస‌భ స‌భ్యులు టి.జి వెంక‌టేష్ మ‌ర్చిపోలేని స‌హ‌కారం అందించార‌ని ఆయన చెప్పారు. ఎమ్మార్పీఎస్ అంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా అంద‌రికీ తెలుస‌న్నారు. అయితే ఎమ్మార్పీఎస్ పేరు ఎవ‌రికీ తెలియ‌ని స‌మ‌యంలోనే ఆయ‌న పెద్దన్నలా ముందుండి స‌హ‌కరించార‌ని కొనియాడారు. ఎమ్మార్పీఎస్ వ‌చ్చాక‌నే మాదిగ‌లు త‌లెత్తుకొని తిరుగుతున్నార‌ని, కులం పేరు ధైర్యంగా చెప్పుకుంటున్నార‌ని చెప్పారు. ఎమ్మార్పీఎస్ ఎదుగుద‌ల‌లో టి.జి వెంక‌టేష్ పాత్ర కీల‌క‌మ‌న్నారు. ఆయ‌న వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన టి.జి భ‌ర‌త్‌ను గెలిపించేందుకు మాదిగ‌లు సంపూర్ణ మ‌ద్దతు ప్రక‌టించాల‌న్నారు. టి.జి కుటుంబం రుణం తీర్చుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అన్నారు. క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలోని మాదిగ‌లు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఓటు మాత్రం టి.జి భ‌ర‌త్‌కే వేయాల‌ని ఆయ‌న కోరారు. టి.జి భ‌ర‌త్‌ను అఖండ మెజారిటీతో గెలిపించేందుకు మాదిగ‌లు, ఉప కులాలు నిద్రాహారాలు మాని క‌ష్టప‌డాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

About Author