PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హోసూరులో మాజీ సర్పంచ్ దారుణ హత్య     

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. హోసూరు గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకులు వాకిటి శ్రీనివాసులు యాదవ్ 45 సం.లు. గురువారం దారుణ హత్యకు గురయ్యారు. శ్రీనివాసులు యాదవ్ ఉదయం బహిర్ భూమికి  వెళ్లిన సమయంలో దుండగులు మాటువేసి తలపై రాడుతో మోది దారుణంగా హత్య చేశారు. దుండగులు అతనిని హత్య చేసిన తర్వాత ఆధారాలు చిక్క కూడదని మృతునిపై కారం చల్లి వెళ్లినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. హత్య జరిగిన ప్రాంతం భయానకంగా మారింది. గ్రామంలో మృతుని  బంధువుల రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులంతా శ్రీనివాసులు హత్య ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామస్తులు, కుటుంబ  సభ్యులు  జరిగిన  సంఘటనలు జీర్ణించుకోలేకపోతున్నారు.మృతునికి గ్రామంలో మంచి పేరు ఉంది. గ్రామస్తులంతా అతన్ని అజాతశత్రువుగా భావిస్తారు. హత్యా ఘటన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎలాంటి ప్రతీకార చర్యలకు దారి తీయకుండా పోలీసులు గ్రామంలో గస్తీ ఏర్పాటు చేశారు. స్థానిక డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ జయన్న, ఎస్సై వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని హత్యకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీశారు. అనంతరం ఎస్పీ బిందు మాధవ్ సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు దారి తీసిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్య సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని నిందితులను సాయంత్రం లోపు పట్టుకుంటామని ఎస్పీ మీడియాకు తెలిపారు. టిడిపి నాయకులు శ్రీనివాసులు యాదవ్ సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్యాంబాబు  హత్య ఘటన స్థలానికి వచ్చారు. సౌమ్యుడు, స్నేహశీలి, మంచి పేరున్న టిడిపి నాయకులు శ్రీనివాసులు హత్యను ఎమ్మెల్యే శ్యాంబాబు తీవ్రంగా ఖండించారు.

About Author