PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాణ్యమైన విద్యాబోధనతో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం పెంచాలి!

1 min read

ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలి

అన్ని స్కూళ్ళలో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఏర్పాటు చేయండి

సిఎంతో సహా అందరం మోడల్ పిటిఎం సమావేశాలకు హాజరవుతాం

గత ప్రభుత్వం వేలకోట్లు వెచ్చిస్తే 2లక్షలమంది విద్యార్థులు ఎలా తగ్గారు?

 బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు

  “సాల్ట్” ప్రాజెక్టుపై పాఠశాల విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

పల్లెవెలుగు వెబ్ అమరావతి: నాణ్యమైన విద్యాబోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సి ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ (SALT) ప్రాజెక్టు అమలుతీరుపై పాఠశాల విద్య అధికారులు, సంబంధిత ఏజన్సీల ప్రతినిధులతో ఉండవల్లి నివాసంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో సాల్ట్ ప్రాజెక్టు అమలులో వెనుకబడటంపై కారణాలను తెలుసుకున్నారు. నాడు-నేడు, సాల్ట్ వంటి పథకాలపై గత ప్రభుత్వం వేలకోట్లు ఖర్చుచేసినట్లు కాగితాల్లో చూపుతోందని, అదే నిజమైతే గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలమంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు. దీనిపై లోతైన విశ్లేషణ చేసి, నాణ్యమైన విద్య అందించి మెరుగైన ఫలితాల సాధనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. రాబోయే అయిదేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ నెట్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలల స్థాయిలో ఎసెస్ మెంట్ మరింత శాస్త్రీయంగా ఉండేవిధంగా డిజైన్ లో మార్పులు చేయాలని ప్రథమ్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. డిజిటలైజ్డ్ ఎసెస్ మెంట్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించి ఆన్ లైన్ కు అనుసంధానించడంపై దృష్టిసారించాలని ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ సంస్థను ఆదేశించారు. టీచింగ్ టూల్స్ అబ్జర్వేషన్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ బోధనాపద్ధతులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ (ఎల్ఎఫ్ఇ) ప్రతినిధులకు సూచించారు. ఆయా ఏజన్సీలు నిర్వహిస్తున్న ఎసెస్ మెంట్, శిక్షణా కార్యక్రమాలు అర్థవంతంగా, ఫలితాల మెరుగుదలకు దోహదపడేలా ఉండాలని అన్నారు. ఇంటర్మీడియట్ లో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానాన్ని అమలుచేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజాప్రతినిధులంతా మోడల్ పిటిఎం సమావేశాలకు హాజరై తల్లిదండ్రుల మనోగతాన్ని తెలుసుకుంటామని, ప్రభుత్వ పాఠశాలల మెరుగైన పనితీరు కోసం తల్లులను భాగస్వాములను చేయాలని అన్నారు. బాల్యం నుంచే మహిళలను గౌరవించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు, పిడబ్ల్యుసి ప్రతినిధులు సుచీంద్ర కుమార్, సోనాల్ శివగుండే, సునీత, కె.సురేష్ బాబు (ప్రథమ్), దత్తాత్రేయ, మజీద్ (ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్), వైభవ్ పాండే, నాగ సాయికృష్ణ(కైవల్య ఫౌండేషన్),  సిద్దేష్ శర్మ (లీడర్ షిప్ ఫర్ ఈక్విటీ) తదితరులు పాల్గొన్నారు.

About Author