PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యవసాయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి – ఏవో

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: వెలుగోడు మండలంలో వరి పంట 3,500 హెక్టార్ల సాధారణ విస్తీర్ణం ఉండగా ఇప్పటికీ 1500 హెక్టార్లు వరి నారులు వేసుకోవడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. వరి నారు యాజమాన్యం మరియు వరి నారు పోసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే దాకా సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి సాధించే అవకాశం ఉందని, వరి నాటు వేసే సమయంలో ఎలాంటి పద్ధతులు పాటించాలో, నారు పొలానికి ఎలాంటి జాగ్రత్తలతో తీసుకెళ్లాలనే విషయాన్ని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ వివరించారు. వరి నాట్లు వేసే పొలాన్ని దాదాపు మూడు వారాల ముందు నుంచి తయారు చేయాలి. ట్రాక్టర్‌ లేదా ఎడ్ల నాగలితో ఒక సాలు దున్నిన తరువాత మరో నాలుగైదు రోజులకు మరో సాలు చేయాలి. దీంతో కలుపు మొక్కలు బురదలో కూరుకుపోయి పంటకు ఎరువుగా ఉపయోగపడుతుంది. అదే హడావిడిగా పొలాన్ని సిద్ధం చేసినట్లయితే కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో కలుపు మొక్కలు సైతం వరితో సమానంగా పెరిగి పంటను దెబ్బతీస్తాయి. పచ్చిరొట్ట విత్తనాలు జనుము, జీలుగ వేస్తే వాటిని కలియదున్నే సమయంలో 50 కిలోల సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ వేసినట్లయితే పచ్చిరొట్ట ఎరువులు త్వరగా చివికి మొక్కలకు భాస్వరం ఎరువును అందిస్తాయి. ప్రధాన పొలాన్ని దున్నిన తర్వాత చదును చేసేందుకు జంబు కొట్టాలి. జంబు బాగా కొడితే నీటి వృథాను అరికట్టడంతో పాటు కలుపుకూడా అదుపులో ఉంటుంది. సాగునీరు పెట్టినప్పుడు పొలమంతటికి అందే అవకాశముంది. చివరి దమ్ములో ఆయా ప్రాంతాలకు సిఫార్సు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఎరువులను మొదటి దపాగా వేసుకోవాలి. కాంప్లెక్స్‌ ఎరువులను వాడదలుచుకుంటే రైతు సోదరులు దుక్కిలోనే వేసుకోవడం మంచిది. వరిలో పైపాటుగా వేసిన కాంప్లెక్స్‌ ఎరువులను మొక్కలు సమర్ధ వంతంగా వినియోగించుకోలేవు. దమ్ములో జింక్‌, భాస్వరం ఎరువులను ఒకేసారి వేయకుండా రెండు మూడు రోజుల తేడాతో వేసుకోవాలి. పొలం గట్లపై కలుపు మొక్కలను, గడ్డిని ఎప్పటికప్పుడు తీసివేయాలి. నాట్లు వేయాలంటే నారు ఆరోగ్యంగా ఉండాలి. నాలుగు నుంచి ఆరు ఆకులు కలిగిన నారు ప్రధాన పొలంలో నాటు వేసేందుకు అనుకూలం. పొలాన్ని బురద బురదగా తయారు చేసి అందులో పైపైన 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతున నాట్లు వేయడం మంచిది. వరి నారును లోతుగా నాటు వేస్తే పిలకలు రావడం ఆలస్యమవుతుంది. పిలకల సంఖ్య కూడా తగ్గిపోతుంది. నాటిన మొక్క లేచి చనిపోకపోతే కుదురున ఒకటి లేదా రెండు మొక్కలు నాటినా, గింజ దిగుబడిలో ఎలాంటి తేడా ఉండదు. కుదురుకు రెండు నుంచి మూడు నారు మొక్కలు నాటవచ్చును. నాటే సమయంలో నారు తలలు తుంచి నాటుకోవడం మంచిది. ఎందుకంటే పొడవాటి నారు మొక్కల చివరి ఆకులు పొలంలో వాలి పోయి బురదకు అంటుకు పోవడంతో ఆకులకు ఆశించే తెగుళ్లు వేగంగా వృద్ధి చెందుతాయి. ఆకులను కత్తిరించుకోకుండా ఉండాలంటే ఆరోగ్యవంతమైన నారును సరైన వయసులో నాటుకోవడం మంచిది. నాట్లు ఆలస్యమై ముదురు నారు నాటుకోవాల్సి వస్తే కుదుళ్ల సంఖ్య పెంచుకోవాలి. మొక్కలు సమాన దూరంలో ఉంటేనే అన్ని రకాల లాభదాయకం. దీనికి తోడు నత్రజని మూడు దపాలకు బదులుగా రెండు సార్లు వేసుకోవాలి. మొదటి దపాలో 70 శాతం, చివరి దమ్ములో 30 శాతం నత్రజనిని అంకురార్పణ జరిగే దశలో వేసుకోవాలి. దీంతో పిలకలు త్వరగా వచ్చి నాట్లు ఆలస్యమైన దిగుబడిపై ప్రభావం చూపదు. కానీ సాధ్యమైనంత వరకు లేత నారును నాటుకోవడం మంచిదని రైతులకు అవగాహన కల్పించారు. అబ్దుల్లాపురం గ్రామంలో రైతులు వేసిన మొక్కజొన్న పైరును, అలాగే వరి నారుమడిని ఏవో పవన్ కుమార్ పరిశీలించడమైనది. రైతులు సెప్టెంబర్ 15 లోగా ఈపంట నమోదు చేసుకోవాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో పవన్ కుమార్ తో పాటు అబ్దుల్లాపురం వ్యవసాయ విస్తరణ సిబ్బంది అంజిత్ కుమార్ రెడ్డి , రైతులు, తదితరులు పాల్గొన్నారు.

About Author