ఏపీని ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తా…
1 min readధైర్యంగా… నమ్మకంగా పెట్టుబడులు పెట్టండి…
- పారిశ్రామిక వేత్తలకు అన్ని సౌకర్యాలు, రాయితీ కల్పిస్తా..
- పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్
- మంత్రిగా మొదటిసారి కర్నూలుకు వచ్చిన టీజీ భరత్కు
గజమాలతో ఘనస్వాగతం పలికిన ప్రజలు
కర్నూలు, పల్లెవెలుగు: ఆంధ్ర ప్రదేశ్ను పరిశ్రమలకు హబ్ గా మారుస్తానని స్పష్టం చేశారు పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అనువుగా ఉంటుందని, పారిశ్రామిక వేత్తలకు సకల సౌకర్యాలు, రాయితీలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారి కర్నూలుకు వచ్చిన టీజీ భరత్కు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. ఐదు కోట్ల మంది ప్రజలకు మంత్రిగా సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో మంత్రిగా ఎంపిక చేసి కీలక శాఖలను కేటాయించిన చంద్రబాబు నాయుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. తమ ప్రభుత్వంలో పెట్టుబడిదారులను ఆకర్షించి రాయితీలు కల్పిస్తామని చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ తీసుకువచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ జోన్ ఉందని ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో మాట్లాడి విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై చర్చిస్తామని చెప్పారు. ఇప్పుడే తమ ప్రభుత్వం కొలువుదీరిందని.. ఒకదాని తర్వాత ఒకదాన్ని స్టడీ చేసి ముందుకు వెళ్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కంటే 100 రెట్లు మంచి పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.