PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్టీసీలో నెల‌కొన్న‌ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది..

1 min read

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్

4 నూత‌న ఆర్టీసీ బ‌స్సులు ప్రారంభించిన మంత్రి టి.జి భ‌ర‌త్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి

అభివృద్ధికి మారుపేరు సీఎం చంద్రబాబు నాయుడు.. మంత్రి టి.జి భ‌ర‌త్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలోని సమస్యలను అంచలవారిగా ప్రణాళిక బద్ధంగా పరిష్కరిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. శనివారం కర్నూలు-1 డిపో గ్యారేజీలో 4 కొత్త బస్సులను పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి టి.జి.భరత్ జెండా ఊపి ప్రారంభించి అనంత‌రం బస్సు న‌డిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి టి.జి భ‌ర‌త్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి అన్నారు. గ‌త ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేద‌న్నారు. త‌మ‌ ఎన్డీయే ప్రభుత్వం ఆర్టీసీలోని సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నుండి కర్నూలు, ఎమ్మిగనూరు నుండి హైదరాబాద్, ఆదోని నుండి కర్నూలు, కర్నూలు నుండి శ్రీశైలంకు 4 బస్సులను, గత నెలలో ఆరు బస్సులను మొత్తం 10 బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లా ప్రజల సౌకర్యార్థం రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో బ‌స్సుల సంఖ్య‌ను పెంచుతున్నామ‌ని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామ‌ని మంత్రి అన్నారు. ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని ముందుగా అన్ని రూట్లలో బ‌స్సుల సంఖ్యను పెంచుతున్నట్లు చెప్పారు. కర్నూలు బస్టాండ్‌లో ప్రజల సౌకర్యాలను ఇంకా అభివృద్ధి పరిచేలా చర్యలు చేపడతామని మంత్రి  అన్నారు. పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని ఆర్టీసీని ప్రణాళిక బద్ధంగా అంచలవారిగా అభివృద్ధి చేస్తుందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం గత నెలలో 6 బస్సులను ఇప్పుడు 4 బస్సులను మొత్తం పది బస్సులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని ఇకనుంచి ఆర్టీసీని ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అన్నారు. కార్యక్రమంలో  జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు,కర్నూలు-1 డిపో మేనేజర్ సుధారాణి, కర్నూలు-2 డిపో మేనేజర్ సర్దార్ హుస్సేన్, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author