పారిశ్రామిక వర్గాల్లో నమ్మకం పెరిగింది…మంత్రి టి.జి భరత్
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: ఆరు నెలల క్రితం పారిశ్రామిక వేత్తలు తమను కలిసినప్పుడు 1947లో స్వాతంత్య్రo చూసామో లేదో కానీ, ఈ ప్రభుత్వం వచ్చాకే నిజమైన స్వాతంత్య్రo చూసామని చెప్పారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ అన్నారు. అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మాట్లాడే దానికి కానీ లేదా ఏదైనా విషయం అడగడానికి కానీ వీలు కలిగిందని పారిశ్రామికవేత్తలు చెప్పారని మంత్రి తెలిపారు. గత ఎనిమిది నెలల్లో పారిశ్రామిక వర్గాల్లో తమ ప్రభుత్వం ఒక విశ్వాసాన్ని కలిగించిందన్నారు.సుమారు 6.50 లక్షల కోట్ల రూపాయలు నిజమైన పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. లక్షల ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయన్నారు. చాలా మంది సభ్యులు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలని, పరిశ్రమలు తెప్పించాలని కోరుతున్నారన్నారు. సభ్యులు విజయ్ కుమార్ రాజు, యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణ చైతన్య, ఈశ్వరరావు చెప్పిన అంశాలను తాను, తమ ప్రిన్సిపల్ సెక్రెటరీ నోట్ చేసుకున్నామని.. దాన్ని పారిశ్రామికవేత్తలతోనూ, మా సమీక్షలలో కచ్చితంగా చర్చించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటామని మంత్రి టి.జి భరత్ చెప్పారు.అంతకుముందు శాసన మండలిలో ఆయన మాట్లాడారు. ముందుగా ఎమ్మెల్సీ వంకా రవీంద్ర నాథ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధి గ్రాంటు క్రింద రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయకపోవడం వల్ల పెండింగ్ లో ఉన్న కొనసాగుతున్న పనుల వివరాలు ఏంటని ఎమ్మెల్సీ వంకా రవీంద్ర నాథ్ అడిగారు. అలాంటివి ఏమీలేవని మంత్రి తెలిపారు. దీంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు (టెట్లీ) ఇండస్ట్రీయల్ ఎస్టేట్ పనులు మధ్యలో నిలిచిపోయాయా అని అడగ్గా.. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.10.10 కోట్ల (కేంద్ర ప్రభుత్వం వాటా 8 కోట్లు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం / ఎ.పి.ఐ.ఐ.సి వాటా రూ.2.10 కోట్లు) ఎంఎస్ఇ-సిడిపి కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద ఎపిఐఐసి ద్వారా పశ్చిమ గోదావరిలో టేట్లే, తణుకు వద్ద ఇండస్ట్రీయల్ ఎస్టేట్ పనిని చేపట్టడమయిందని మంత్రి తెలిపారు. మొదట ఎపిఐఐసి వాటా (మొదటి వాయిదా) నుండి రూ.1.5 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేయడమయింది. నిధులు అయిపోయే వరకు ఏజెన్సీకి చెల్లింపులు చేయడమయింది. ఆ ఏజెన్సీ వెంటనే పనిని తాత్కాలికంగా ఆపివేసింది. 21-01-2025 తేదీన ఎపిఐఐసికి రూ.2.00 కోట్ల మొదటి వాయిదా సహాయక గ్రాంటును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ తేదీ వరకు బిల్లులను ఏజెన్సీలకు ఎపిఐఐసి చెల్లింపులను విడుదల చేయడమయింది. అప్పటినుండి ఏజెన్సీ తిరిగి పనులను ప్రారంభించిందని మంత్రి టి.జి భరత్ చెప్పారు. ఇప్పటివరకు పనికోసం చేసిన వ్యయం రూ.3.17 కోట్లు (వినియోగించిన కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.24 కోట్లు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం / ఎపిఐఐసి వినియోగించిన వాటా రూ..1.93 కోట్లు) అని, ఏజెన్సీ పనిని ప్రారంభించింది, మిగిలిన పెండింగ్ పనులు జరుగుతున్నాయని టి.జి భరత్ సమాధానమిచ్చారు. పెట్టుబడిదారులకు భూముల కేటాయింపు విషయంలో ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం ఉందన్నారు. ఇప్పటికే ఉన్న కంపెనీలకు సైతం ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని పరిష్కరించే విధంగా తాము ముందుకు వెళుతున్నట్లు మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.