‘ పది’ విద్యార్థులకు… విజయోస్తు..
1 min read
నెగిటివ్ ఆలోచనలు మనసులోకి రానివ్వొద్దు..
- ఆత్మస్థైర్యంతో మెలగండి… ప్రణాళికతో రాయండి…
- తల్లిదండ్రులు విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోండి
- ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, మానస క్లినిక్ అధినేత డా. రమేష్ బాబు
కర్నూలు, న్యూస్ నేడు : పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, మానస క్లినిక్ అధినేత డా. రమేష్ బాబు . రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17 నుంచి 31 వ తేదీ వరకు జరుగు పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఆత్మస్థైర్యంతో మెలగాలన్నారు. కర్నూలు నగరం ఎన్ ఆర్ పేటలోని మానస క్లినిక్ అధినేత, ప్రముఖ సైకియాట్రిక్ వైద్యులు డా. రమేష్ బాబు విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మొత్తం 40,776 మంది పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారని, వీరందరూ విజయవంతంగా పరీక్ష రాయడానికి విద్యార్థుల తల్లిదండ్రులు వారికి సహకరించాలన్నారు. విద్యార్థులు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని, నెగిటివ్ ఆలోచనలు మనసులోకి రానివొద్దన్నారు. ఏడాదంతా చదివిన పాఠాలను ఒకే నెలలో గుర్తు చేసుకుంటూ రాయాలని, ఇందులో భయపడాల్సిందేమీ లేదన్నారు. ప్రతి రోజు జరిగిన తరగతి పాఠాలను ఎప్పటికప్పుడు నేర్చుకొని ఉంటారని, పరీక్ష మాసంలో మాత్రం మరోసారి చదివితే సరిపోతుందన్నారు. పబ్లిక్ పరీక్షలు అంటేనే టెన్షన్..భయం..తో కొందరు విద్యార్థులు వణికిపోతుంటారని, అలాంటి పరిస్థితి రానివ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాలన్నారు. విద్యార్థుల నైపుణ్యత, శ్రద్ధ ను ప్రోత్సహిస్తూ.. వారికి అనుకూలమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని పేర్కొన్న డా. రమేష్ బాబు…. శాస్ర్తీయ పద్ధతి.. చక్కటి ప్రణాళికతో చదివిన విద్యార్థులు పరీక్ష సమయంలో నిమిషం కూడా వృథా చేయకుండా రాస్తారని, అటువంటి వారు సత్ఫలితాలు సాధిస్తారన్నారు. పరీక్ష రోజు ఉదయం అల్పాహారం భుజించి… హాల్ టిక్కెట్, పెన్ను, పెన్సిల్ తదితరవి మరిచికపోకుండా నిర్ధిష్టమైన సమయం కన్నా అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని ఈ సందర్భంగా మానస క్లినిక్ అధినేత, సీనియర్ సైకియాట్రిక్ వైద్యులు డా. రమేష్ బాబు సూచించారు.