PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాంబియా న‌ర్సుకు కిమ్స్ ఆస్పత్రిలో అరుదైన చికిత్స

1 min read

– ఆ దేశంలో ఏడుసార్లు శ‌స్త్రచికిత్స‌లు.. అన్నీ విఫ‌లం
– ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్‌లో ఊర‌ట‌
పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్‌: ప్రాణాపాయ ప‌రిస్థితిలో హైద‌రాబాద్‌కు వ‌చ్చిన జాంబియా దేశానికి చెందిన న‌ర్సుకు కిమ్స్ వైద్యులు స‌మ‌గ్రంగా శ‌స్త్రచికిత్స‌లు చేసి ప్రాణాలు నిల‌బెట్టారు. ఆమె స‌మ‌స్యను, చేసిన చికిత్స వివ‌రాల‌ను కిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియ‌ర్ క‌న్సల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు, లాప్రోస్కొపిక్‌, హెప‌టో-పాంక్రియాటికోబైల‌రీ స‌ర్జన్ డాక్టర్ జి.పార్థసార‌థి వివ‌రించారు.”దక్షిణాఫ్రికా మధ్య దేశ‌మైన జాంబియాలోని ఒక ఆస్పత్రిలో న‌ర్సుగా ప‌నిచేస్తున్న 36 ఏళ్ల మ‌హిళ‌కు ముగ్గురు పిల్లలున్నారు. కొంత‌కాలం క్రితం అక్కడ ఆమె ప‌నిచేసే ఆస్ప‌త్రిలోనే హిస్ట‌రెక్టమీ జ‌రిగింది. అయితే, ఆ స‌మ‌యంలో పొర‌పాటున గ‌ర్భ‌సంచి తొల‌గించే క్రమంలో పేగుల‌కు కూడా గాయ‌మైంది. కొన్నాళ్ల త‌ర్వాత స‌మ‌స్య‌లు రావ‌డంతో.. మ‌ళ్లీ తెరిచి, పేగుల‌కు అయిన గాయానికి కుట్లు వేశారు. కొంత‌కాలం త‌ర్వాత అదీ విఫ‌ల‌మైంది. మూత్రవిస‌ర్జన మార్గం నుంచే మ‌ల విస‌ర్జన కావ‌డం లాంటి ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దాంతో ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా.. ఏకంగా ఏడు సార్లు శ‌స్త్రచికిత్సలు చేశారు. అయినా ఎలాంటి ఫ‌లితం లేక‌పోగా…క‌డుపులోప‌ల తీవ్రంగా ఇన్ఫెక్ష‌న్ మొద‌లైంది. చివ‌ర‌కు పొట్ట మీద వేసిన కుట్లలోంచి కూడా అన్నీ బ‌య‌ట‌కు రావ‌డం మొద‌లైంది. చివ‌ర‌కు ఏం తిన్నా, ఏం తాగినా వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చేసేవి. తిన్న‌వెంట‌నే పొట్టమీద వేసిన కుట్ల నుంచి వ‌చ్చేస్తుండ‌టంతో ఆమెకు స‌మ‌స్య చాలా తీవ్రత‌ర‌మైంది. అక్కడ ఆస్పత్రిలో వైద్యులు చేతులెత్తేశారు. తాము ఈ కేసులో ఏమీ చేయ‌లేమ‌ని తేల్చిచెప్పేశారు. దాంతో.. ఆమెను జాంబియా నుంచి హైద‌రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వ‌చ్చేట‌ప్పుడు విమానంలో ఆమెకు ఎలాంటి ఆహారం, ద్రవాలు కూడా ఇవ్వకుండా.. పొట్టమీద కుట్లు ఉన్న భాగంలో దూదితో ప్యాడ్ క‌ట్టి జాగ్రత్తగా తీసుకొచ్చారు.కిమ్స్ ఆస్పత్రికి రాగానే ఆమెను ముందుగా ఐసీయూలో చేర్చాం. తొలుత ఒక శ‌స్త్రచికిత్స చేసి.. పేగుల‌కు అవ‌స‌ర‌మైన చోట కుట్లు వేశాం. అప్పటికే ఇన్ఫెక్షన్ తీవ్రంగా వ్యాపించ‌డంతో కొంత మేర పేగుల‌ను క‌త్తిరించి తీసేయాల్సి వ‌చ్చింది. ఈ శ‌స్త్రచికిత్సకు దాదాపు ఏడు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఇది చాలా సంక్లిష్టమైన శ‌స్త్రచికిత్స కావ‌డంతో ప‌ది రోజుల పాటు ఐసీయూలో ఉంచాల్సి వ‌చ్చింది. త‌ర్వాత మ‌రో శ‌స్త్రచికిత్స చేసి, మ‌ల విస‌ర్జ‌న స‌హ‌జ‌ప‌ద్ధతిలో జ‌రిగేలా ఆ మార్గాన్ని కూడా పున‌రుద్ధరించాం. ఆ శ‌స్త్రచికిత్స చేసిన త‌ర్వాత‌.. ఆమె ప‌రిస్థితి సాధార‌ణంగా మారింది. నోటిద్వారానే ఆమె ద్ర‌వాలు, ఘ‌న ప‌దార్థాలు అన్నీ తీసుకోగ‌లుగుతున్నారు. పూర్తిస్థాయిలో కోలుకోవ‌డంతో.. ఇప్పుడు ఆమె డిశ్చార్జి అయ్యి, త‌న సొంత దేశానికి ప‌య‌న‌మ‌య్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు” అని చెప్పారు. జాంబియా న‌ర్సును దాదాపు మూడు నెల‌ల పాటు కిమ్స్ ఆస్పత్రిలో ఉంచి.. ఆమెకు పూర్తిస్థాయిలో ఊర‌ట క‌ల్పించారు. దాంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. త‌మ పిల్ల‌ల‌కు కావ‌ల్సిన ఆట బొమ్మలు, ఇత‌ర సామాన్లు హైద‌రాబాద్‌లో కొనుక్కుని, వెళ్తున్నారు. ఆమెకు చికిత్స చేయ‌డంలో ప‌లు విభాగాల‌కు చెందిన శ‌స్త్రచికిత్స నిపుణులు, ఇంటెన్సివ్ కేర్ వైద్య‌నిపుణులు, ఎన‌స్థీషియాల‌జిస్టులు, నిబ‌ద్ధ‌త గ‌ల న‌ర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. త‌న‌కు దాదాపుగా పోయింద‌నుకున్న ప్రాణాన్ని తిరిగి నిల‌బెట్టినందుకు కిమ్స్ ఆస్పత్రి యాజ‌మాన్యానికి, వైద్యుల‌కు, న‌ర్సింగ్ సిబ్బందికి అంద‌రికీ ఆమె కృత‌జ్ఞత‌లు తెలిపారు.

About Author