PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక దృష్టితో పరిష్కరించండి

1 min read

మండల స్థాయి స్పందనకు 63 దరఖాస్తులు

జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్

స్పందన కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాధ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్  నంద్యాల/ ఉయ్యాలవాడ: మండల స్థాయి జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం  ఉయ్యాలవాడ మండల కేంద్రంలోని తాహసిల్డార్ కార్యాలయ ఆవరణలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య ఇతర జిల్లా అధికారులు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రిజేంద్రనాధ్ రెడ్డి, జలవనరుల శాఖ ఛైర్పర్సన్ కర్రా గిరిజా హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈ మేరకు స్వీకరించిన విజ్ఞప్తులను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా అధికారులనుఆదేశించారు. మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది కోఆర్డినేషన్ చేసుకుని బియాండ్ ఎస్ఎల్ఎ లోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. మండల స్థాయి స్పందనకు 63 దరఖాస్తులు వచ్చాయని వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా అనేక ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకొని మరీ పరిష్కరిస్తున్నారన్నారు. సమస్యలు ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మండల స్థాయి స్పందనలో కొన్ని వినతులు

1) ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరు గ్రామ వాస్తవ్యుడు ఇమాం హుస్సేన్ సర్వే నంబర్ 920-2 లో 2.03 సెంట్లలో నాకు చెందాల్సిన 0.38 సెంట్ల కు గాను 0.28 సెంట్లు మాత్రమే ఆన్లైన్ లో చూపిస్తుందని…. మిగతా 0.10 సెంట్ల భూమిని ఆన్లైన్ లో చేర్చి తన సమస్యను తీర్చాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.

2) ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామానికి చెందిన పుల్లయ్య తన భార్య పార్వతమ్మకు కాళ్ళు, చేతులు పనిచేయనందున మంచానికి మరియు వీల్ చైర్ కి పరిమితమైందని… వైఎస్ఆర్ పెన్షన్ కానుక నిమిత్తం మెడికల్ సర్టిఫికేట్ ను ఇప్పించగలరని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.

3) ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె  రజకులు గ్రామంలో బట్టలు ఉతకడానికి ప్రభుత్వం దోబి ఘాట్  మరియు బట్టలు అరేసుకోవటం కోసం ఖాళీ స్థలం కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.

About Author