PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అస‌మాన‌త‌ల మీద ఎక్కుపెట్టిన విల్లు ‘అంబేద్కర్​’

1 min read

–ఆధునిక భార‌తదేశం గ‌ర్వించ‌ద‌గ్గ మేధావి

  • ద‌ళితుల జీవితాల‌కు దారిచూపిన టార్చ్ బేర‌ర్
  • అణువ‌ణువు ఆత్మగౌర‌వం కోసం పోరాడిన ధీశాలి
    భీంరావ్ రాంజీ అంబేడ్కర్ భార‌త రాజ్యాంగ నిర్మాత. ప్రముఖ భారతీయ న్యాయవాది. ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. దళితుల పై అంటరానితనాన్ని వ్యతిరేకించారు. కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ప‌ని చేశారు.
    అంబేద్కర్ జననం : బాబాసాహెబ్ అంబేడ్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14న అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్‌లో సైనిక స్థావరమైన ‘మౌ’ అనే ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) రాంజీ మలోజీ సాక్వాల్, భీమాబాయ్ దంపతుల 14వ సంతానంగా జన్మించాడు. అంబేద్కర్ అసలు పేరు భీమారావు రంజీ అంబావడేకర్. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో ఉన్న అంటవాడ గ్రామము. మరాఠీ నేపథ్యం కలవారు. వీరి వంశీకులు మహర్ కులానికి చెందినవారు. అంబేద్కర్ తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారు గా పనిచేసాడు.
    బాల్యంలో అంట‌రానిత‌నం: మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు. మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్ళు తాగాలంటే ప్యూన్ (peon) వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్ళు తాగే అవకాశం వుండేది కాదు. ఈ దుస్థితిని అంబేడ్కర్ క్లుప్తంగా – “ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు” అని వివరించాడు.
    విద్యాభ్యాసం-ఉద్యోగం-కుల వివక్ష: బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పైచదువులు చదవాలన్న పట్టుదల ల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పనిచేసే షరతుపై 1913లో రాజుగారి ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వ ద్యాలయంలో చేరాడు.1915లో ఎం.ఏ.,1916లో పి.హెచ్.డి. డిగ్రీలను పొందాడు.
    దళిత మహాసభ : 1927లో మహాద్‍లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్‍ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని త్రాగుటకు వీలు లేకపోయినా. అంటరానివారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండినది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ ‘బహిష్కృత భారతి’ అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టివుంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’అని ఉండడు. ‘అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు’ అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు.
    అంట‌రానిత‌నానికి పరిష్కారం : భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమాజములో ఉన్నదని ఆయన సమర్థించాడు. కుల, అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపగా అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించాడు.
    పూనా ఒప్పందం: 1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928 లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరచింది. ఈ సమావేశాలు 1930, 1931,1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు అవ్వగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు అయ్యారు. ఈ సమావేశాములోనే గాంధీకి అంబేద్కర్‌కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధి ఒప్పుకోలేదు.
    క‌మ్యూన‌ల్ అవార్డు : 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ “కమ్యూనల్ అవార్డు” ను ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉన్నాడు. ఈ ప్రకటన గురించి తెలుసుకొని గాంధీ నిరాహారదీక్ష చేపట్టాడు. అంబేద్కర్‌పై నైతిక వత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్‌కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధి ‘హరిజన్ సేవక్ సమాజ్’ ఏర్పరచి అస్పృస్యత నివారణకు కృషి చేసాడు.
    రాజ్యంగ పరిషత్తు సభ్యుడిగా- మంత్రివర్గ సభ్యుడిగా అంబేద్కర్:
    రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ ‘రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో ఉండిపోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఏలాంటి సందేహం లేదు’ అన్నాడు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా వుండి 1951 అక్టోబరులో మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
    బౌద్దమ‌త స్వీక‌ర‌ణ‌: అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది. 1956 అక్టోబరు 14న నాగపూర్‌లో అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు (లక్ష మందితో). గాంధీతో అనేక విషయాలలో విభేదించినా తాను మతం మారదలచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూచానన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తిగాంచిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 1956 డిసెంబరు 6 న మహాపరి నిర్వాణం చెందాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ‘ భారతరత్న ‘ అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత అభినందనీయం.
    కేదార్ నాథ్, ఫౌండర్
    నల్లా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, కర్నూలు

About Author