PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బహుజన బాంధవుడు కాన్షీరామ్‌..

1 min read

– కాన్షీరామ్ ఆశయాలు సాధిద్దాం..
– బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి స్వాములు..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి వేడుకలు నందికొట్కూరు పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్పీ, నియోజకవర్గ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాన్షీరాం విగ్రహానికి పూలమాలలు వేసికేక్ కట్ చేసి, నివాళులర్పించారు.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మహేంద్ర, బీఎస్పీ జిల్లా ఇంచార్జి లాజర్, నియోజకవర్గ ఇంచార్జి స్వాములు మాట్లాడుతూ రాజకీయాల్లో చరిత్ర మార్చి బహుజన రాజ్యాధికారాన్ని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో నిలబెట్టిన ఘనుడు మాన్యవీర్‌ కాన్షీ రామ్ అని అన్నారు. అంబేడ్కర్‌ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకం స్ఫూర్తితో పీడిత వర్గాల జీవితాల్ని రాజ్యాధికారం దిశగా తన నాయకత్వంలో ముందుకు నడిపారు. గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, నారాయణ గురు, పెరియార్‌ లాంటి వారిని గురువులుగా భావించారు. వారి ప్రభావంతోనే 1971లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. తదనంతరం 1978లో బ్యాక్‌వార్డ్‌ అండ్‌ మైనారిటీ కమ్యూనిటీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (బామ్‌ సెఫ్‌)ను స్థాపించి అణగారిన వర్గాలలో ఎదిగినవారు తమ వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా కృషి చేశారన్నారు.’రాజ్యాధికారమే మాస్టర్‌ కీ’ అన్న అంబేడ్కర్‌ మాటలను ఆదర్శంగా తీసుకొని 1984లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ స్థాపించారు. బహుజన సమాజాన్ని రాజ్యాధికారం వైపు నడిపించడానికి అంబేడ్కర్‌ చెప్పిన విధంగా ‘బోధించు, సమీకరించు, పోరాడు’ సిద్ధాంతానికి అనుగుణంగా 1983 మార్చి 15న ఢిల్లీ నుండి బయలుదేరి ఏడు రాష్ట్రాల మీదుగా 100 సైకిళ్ళతో 40 రోజులలో 4,200 కిలోమీటర్లు ప్రయాణించి ప్రజలను బహుజన ఉద్యమం వైపు మరల్చిన గొప్ప వ్యక్తి కాన్షీరాం అని కొనియాడారు. ఆయన అలుపెరగని పోరాటంతో ఉత్తరప్రదేశ్‌లో బహుజనులు కొన్ని సార్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే కాక దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ గణనీయమైన రాజకీయ శక్తిగా ఎదిగారన్నారు. 85శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రలోభాలకు లోనవకుండా వారి ఓటు వారే వేసుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా మీడియా ప్రతినిధి నాగేంద్ర, విజయభాస్కర్, ప్రసాదు, విజ్జి, చంద్రబాబు, పాణ్యం నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author