PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారం వచ్చిన వెంటనే.. పన్నుల ‘ప్రక్షాళన’

1 min read

ఆర్యవైశ్యులకు అండగా నిలచింది టిడిపినే!

  • రోశయ్య పేరుతో మ్యూజియం ఏర్పాటుచేస్తాం
  • ఆర్యవైశ్యులతో ముఖాముఖి సమావేశంలో యువనేత లోకేష్

పల్లెవెలుగు: టిడిపి అధికారంలోకి వచ్చాక పన్నుల విధానాన్ని ప్రక్షాళన చేసి, వ్యాపారులకు ఉపశమనం కలిగిస్తామని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. బోర్డు ట్యాక్స్, చెత్తపన్ను వంటివాటితో వ్యాపారులను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా నిలచేది టిడిపి మాత్రమేనని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలులోని శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరి చిన్నమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో నారా లోకేష్ ముఖాముఖిసమావేశమయ్యారు. ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ… రోశయ్యకు ప్రతి పుట్టినరోజుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేవాడిని. రాజకీయాలకు అతీతంగా రోశయ్య పని చేశారు. రోశయ్య చనిపోయినప్పుడు సీఎం జగన్ వెళ్లలేదు. రోశయ్య కాంగ్రెస్ అయినా మాకు ఆయనంటే గౌరవం. రోశయ్యకు తగిన గౌరవం కల్పిస్తాం. మ్యూజియం ఏర్పాటు చేసి, ఆయన సేవల తాలూకా ఆనవాళ్లు మ్యూజియంలో ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి మధ్య పెద్దవాదనలు జరిగినప్పుడు రోశయ్య సంధాన కర్తగా ఉండేవారు. రోశయ్య సీఎం అయ్యాక చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించారు. రోశయ్య చనిపోవడంతో ఆర్యవైశ్యుల్లో పెద్దదిక్కు లేకుండా పోయింది. ఆర్యవైశ్యుల్లో పేదరికం ఉందని చెప్పగానే చంద్రబాబు రూ.30 కోట్లతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం మారాక కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. టీడీపీ వచ్చాక దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేస్తాం. పేదరికానికి కులం, మతం ఉండదు.

వైసిపి పాలనలో ఆర్యవైశ్యులూ బాధితులే! :

కొన్ని కులాలతో పాటు ఆర్యవైశ్యులకు వైసీపీ పాలనలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆ కులాల పట్ల వైసీపీకి ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకోవాలి. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎవర్ని కదిలించినా బాధితులుగా ఉన్నారు.టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయా.? కానీ వైసీపీ నేతలు మాత్రం వారి పార్టీకి చెందిన సుబ్బారావు గుప్తాపై దాడి చేసి గంజాయి కేసు పెట్టారు.  యర్రగొండపాలెంలో ఆదినారాయణ అనే వ్యక్తిని చంపారు. తెనాలిలో కార్పొరేటర్ ను కొట్టారు. వైశ్యులపై ఈ ప్రభుత్వంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. దాడులకు పాల్పడిన వారిని చంద్రబాబు వదిలిపెట్టరు. రౌడీషీటర్లనందరినీ జైల్లో పెడతాం. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం. వైశ్యులకి రక్షణ కల్పిస్తాం.

ఎంతమందిపై కేసులు పెడతారు?:

 పోలీసులు కూడా బయటకు వచ్చి మేము కూడా ఈ ప్రభుత్వంలో బాధితులమే అని వాపోతున్నారు. పక్కరాష్ట్రాల అభివృద్ధిని చూసి అసూయ పడాల్సి వస్తోంది. సమర్థవంతమైన పాలన లేక రాష్ట్రం వెనకబడుతోంది. అందరిలో చైతన్యం రావాలి..ఒక్కరిపై కేసు పెడతారు..వెయ్యి మందిపై పెడతారా.? కర్నూలు ఎందులో తక్కువ..అభివృద్ధికి అన్ని అర్హతలున్నాయి. ఏపీ బ్రాండ్ దెబ్బతింది. అమర్ రాజా ఎక్కువ పన్ను చెల్లిస్తుంది..అలాంటి కంపెనీని తెలంగాణకు తరిమారు. ఇప్పడు ఈ – కామర్స్ వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం కల్పించాలి. కర్నూలులో టిడిపి హయాంలో 1000 మెగావాట్లతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. నాలుగేళ్లుగా సోలార్ ప్లాంట్ పై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చాక జీఎస్టీ పోర్టల్ సమస్య కూడా పరిష్కరిస్తాం.

ఆర్యవైశ్యులకు రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చాం:

ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి, షాపుల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు తగ్గించాలి. చెత్తపన్ను కట్టకపోతే చెత్త తెచ్చి షాపు ముందు పోస్తున్నారు. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గించాలి.ఆర్యవైశ్యులను రాజ్యసభకు పంపింది టీడీపీనే. శిద్ధా రాఘవరావుకు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చాం. 2014 నుండి 2019 వరకు మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. తప్పకుండా వైశ్యులను రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాద్యత తీసుకుంటాం. ఇద్దరు ఎంపీలు, 14 ఎమ్మెల్యేలను గెలిపించండి కర్నూలును మేము అభివృద్ధి చేస్తాం. ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటు చేసింది టీడీపీనే. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూట్రల్ గా ఉన్నవాటిల్లోకి రాజకీయాలు తెచ్చారు.మీ సమక్షంలో మార్పులు జరగాలి..వాటికి మేము సహకరిస్తాం. విదేశాలకు వెళ్లి చదవాలన్న ఆశ చాలా మందిలో ఉంది. ఏపీకి మంచి వనరులు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోనూ ఆంధ్రులు ఉన్నారు. వారికి మంచి అవకాశాలు కల్పిస్తే సొంత రాష్ట్రానికి వచ్చి పనులు చేసుకుంటారు. ఆర్థికంగా వెనకబడిన ఓసీలకు కేంద్రం 10 రిజర్వేషన్ అమలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం అమలు చేయలేదు..మేము వచ్చాక అమలు చేస్తాం.

About Author