PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో పర్యటించిన జిల్లా కలెక్టర్ 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కర్నూల్ జిల్లాకలెక్టర్ సృజన బుదవారం పత్తికొండ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పత్తికొండ పట్టణంలో జరుగుతున్న రోడ్ విస్తరణ పనులను పరిశీలించారు.స్థానిక ప్రజలతో మమేకమై కలెక్టర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సృజన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  విజ్ఞప్తి మేరకు పత్తికొండకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, పంచాయతీ అధికారులతో రోడ్ విస్తరణ పనుల మీద చర్చించారు. ఎమ్మెల్యే శ్రీదేవి కలెక్టర్ సృజనతో కలిసి రహదారి వెంట తిరుగుతూ రోడ్డు విస్తరణ ఆవశ్యకతను వివరించారు .పత్తికొండ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు విస్తరణ కోసం ఎదురుచూస్తున్నారని కలెక్టర్ కు ఎమ్మెల్యే తెలిపారు. ప్రాథమిక స్థాయిలో ఆక్రమణలను తొలగించి, జూన్ మాసంలోగా భూసేకరణ ద్వార బాధితులకు పరిహారం చెల్లింపులు పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రభుత్వ హాస్పిటల్ ని సందర్శించారు.అక్కడి పరిస్థితులను ఆమె పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్ పరికరాల కోసం గతంలోనే కలెక్టర్ గారికి విన్నవించడం జరిగిందని, పరికరాలు సమకూరిస్తే రోగులకు మెరుగైన సేవను అందించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే శ్రీదేవి ఈ సందర్భంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు  కలెక్టర్ సృజన స్పందిస్తూ, ఖచ్చితంగా ఆసుపత్రికి కావాల్సిన హైడ్రాలిక్ టేబుల్, మరిన్ని పరికరాలు త్వరలోనే పంపించే ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author