డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అభివృద్ధికి కృషి
1 min read
వైద్య పరిశోధనలకు ప్రాధాన్యమిస్తా
- డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ డా. చంద్ర శేఖర్
- సీఎం, రాష్ట్ర గవర్నర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు
కర్నూలు ( హాస్పిటల్ ), న్యూస్ నేడు :రాష్ట్రంలో డా. ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు డా. ఎన్టీ ఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్. శుక్రవారం విజయవాడలోని డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ కార్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా డా. చంద్ర శేఖర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాంప్రదాయ పద్ధతిలో భాగంగా ముందుగా శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్ర పటానికి పూజలు చేసిన అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా డా. చంద్ర శేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ డా. అబ్దుల్ నజీర్ను రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్ కు పుష్పగుచ్చం అందజేసి.. శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ మాట్లాడుతూ డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అభివృద్ధిలో తన మార్క్ కనిపించేలా కృషి చేస్తానన్నారు. ప్రొఫెసర్ల టీచింగ్, విద్యార్థుల క్రమ శిక్షణ, ఉద్యోగుల విధులు , వైద్య పరిశోధనలు తదితర అంశాలలో క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేసిన డా. పి. చంద్ర శేఖర్…. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన విజనరీ సీఎం చంద్ర బాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర గవర్నర్ డా. అబ్దుల్ నజీర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. సత్య కుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
