ఏలూరు జిల్లాను రాష్ట్రస్థాయిలో అభివృద్ధిపథంలో నిలపాలి…
1 min read
జిల్లా,నియోజకవర్గాల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళికలు వెంటనే సమర్పించండి
అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం
వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లాను రాష్ట్రస్థాయిలో అభివృద్ధిపథంలో నిలిపేవిధంగా ఏలూరు జిల్లా మరియు నియోజకవర్గాల వారీగా అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళికలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శనివారం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర-విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వృద్ధి రేటు లక్ష్యంగా జిలాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలలోను మరియు జిల్లాలో వ్యవసాయం, అనుబంధ రంగాలు, పారిశ్రామికాభివృద్ధి, తదితర రంగాలలో సుస్థిరాభివృద్దికి నిర్దేశించిన లక్ష్యాలతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి సమర్పించాలన్నారు. జిల్లాలో విస్తృతంగా లభిస్తున్న వనరులు, ఆహార, ఉద్యానవన రంగాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు, జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అనుకూల పరిస్థితులు, తదితర అంశాలను ప్రణాళికలో పొందుపరచాలన్నారు. జిల్లా, నియోజకవర్గాల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు సమర్పించవలసి ఉన్నందున ప్రణాళికలను వెంటనే రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జునరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్, జిల్లా సహకార అధికారి ఏ.శ్రీనివాస్,డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఎస్సి కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్.వి. నాగరాణి, డిఎస్ఓ శివరామమూర్తి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధ్ బాబు,మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పీడి రవికుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.
