పిల్లల్లో అత్యవసర పరిస్థితులు…!
1 min read
– అత్యాధునిక సాంకేతికత వైద్యం
* ఎక్మో, సీ.ఆర్.ఆర్.టి లాంటి చికిత్సలు
* ఊపిరితిత్తులు, గుండె సంబంధిత కీలక వైద్యం, కిడ్నీ మార్పిడి పరిస్థితులు
* కర్నూలు కిమ్స్ కడల్స్ లో వైద్యులకు వర్క్ షాప్
* రాయలసీమ వ్యాప్తంగా వచ్చిన 140 మంది వైద్యులు
కర్నూలు, న్యూస్ నేడు : చిన్న పిల్లల్లో ఒక్కోసారి అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయని, వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే అత్యాధునిక చికిత్సలు చేయాల్సి ఉంటుందని సీనియర్ వైద్య నిపుణులు తెలిపారు. పిల్లల్లో ఎక్మో, సీఆర్ఆర్టీ (కంటిన్యువ్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ) లాంటి చికిత్సలు చేయాల్సి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన విధి విధానాలపై రాయలసీమ వ్యాప్తంగా ఉన్న పలువురు చిన్నపిల్లల వైద్య నిపుణుల కోసం కర్నూలు కిమ్స్ ఆస్పత్రి, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రీషియన్స్ (ఐఏపీ) ఆధ్వర్యంలో ఆదివారం ఒక కంటిన్యువస్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) వర్క్షాప్ నిర్వహించారు. ఎక్స్ట్రా కార్పోరియల్ థెరపీస్ అంటే.. ఎక్మో, సీఆర్ఆర్టీ, ఇంకా పలు రకాల చికిత్సా విధానాలపై అక్కడకు వచ్చిన చిన్నపిల్లల వైద్యులందరికీ సమగ్రంగా వివరించారు. దాంతోపాటు అత్యాధునిక పరికరాలు కూడా అక్కడకు తీసుకొచ్చి, వాటిపై ఎలా పనిచేయాలో తెలిపారు. ప్రత్యక్షంగా ఆయా పరికరాలను ఉపయోగించడం ద్వారా చిన్నపిల్లలు, శిశువులకు ప్రాణాపాయ పరిస్థితిలో అందించాల్సిన అత్యవసర వైద్య విధానాలపై సమగ్రంగా విశ్లేషించారు. ఎక్మో అందించడంతోపాటు అందులో వస్తున్న అత్యాధునిక టెక్నాలజీలు, టెక్నిక్ల గురించి చెప్పారు. చిన్నపిల్లల్లో సీఆర్ఆర్టీ చేయాల్సి వచ్చినప్పుడు కొత్త ప్రోటోకాల్స్ ఏవేం వచ్చాయో, పరికరాలు ఏం ఉన్నాయో కూడా తెలిపారు. అలాగే ఇటీవలి కాలంలో చేసిన కొన్ని కేసుల గురించి, ఆ విషయంలో ఎదుర్కొన్న సవాళ్లు, విజయవంతంగా అయిన సందర్భాల గురించి కూడా సమగ్రంగా చర్చించారు. ముందుగా శనివారం ఒక రోజంతా ఆన్లైన్ లెక్చర్లు నిర్వహించిన తర్వాత ఆదివారం ప్రత్యక్షంగా వర్క్షాప్ ఏర్పాటుచేశారు. రాయలసీమ ప్రాంతంలో ఇలా చిన్నపిల్లల సమస్యల విషయంలో నిర్వహించిన మొట్టమొదటి సీఎంఈ ఇదే కావడం గమనార్హమని ఐఏపీ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ ఆనంద్ బాబు, కార్యదర్శి డాక్టర్ వి. వీర రత్నాకర్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ జె.ఎల్. ప్రకాష్ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఏపీఎంసీ కాన్ఫరెన్స్ పరిశీలకుడు డాక్టర్ జి.సుధాకర్, కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ పరాగ్ డెకాటే, డాక్టర్ చేతన్ ఆర్. ముందాడ, డాక్టర్ బాబు ఎస్. మదార్కర్, డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ రవికిరణ్, డాక్టర్ సాహితి, డాక్టర్ అవినాష్ రెడ్డి, డాక్టర్ కల్యాణ్, డాక్టర్ సుమన్ తదితరులు పాల్గొని, వైద్యులందరికీ అవగాహన కల్పించేలా మాట్లాడారు. ఆస్పత్రి సీఓఓ డాక్టర సునీల్ సేపూరి మాట్లాడుతూ.. కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్యం అందించడంతో పాటు రాయలసీమ వైద్యులందరికీ అవగాహన కార్యక్రమాల నిర్వహణ ద్వారా సమాజానికి ఆధునిక వైద్యం అందిస్తున్నామని తెలిపారు.