సామూహిక వివాహాలకు ఆర్థిక సహాయం…
1 min read
శివ స్వాములకు 10000 రూపాయలు ఆర్థిక సహాయం
పెద్ద మనసు చాటుకున్న టిబిపి ఎల్ ఎల్ సి డిసీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు
కృతజ్ఞతలు తెలిపిన శివ స్వాములు
పల్లెవెలుగు, హొళగుంద: ఈనెల 23వ తేదీన మండల కేంద్రం హోలగుందలో శివ స్వాముల ఆధ్వర్యంలో ఆదోని రోడ్డులోని సోమేశ్వర దేవాలయం వద్ద నిర్వహించనున్న సామూహిక వివాహాలకు ఆర్థిక సహాయాన్ని అందజేసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, తుంగభద్ర బోర్డు దిగువ కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు అండగా నిలిచారు. సామూహిక వివాహాలు పేదలకు ఆర్థిక భారాన్ని తగ్గించి అండగా నిలుస్తాయని , శివ దీక్షలో ఉన్న తాము ఆ పరమశివుని అనుగ్రహంతో చేస్తున్నటువంటి సామూహిక వివాహాలకు చేయూతనందించాలని కోరుతూ గురువారం తనను కలిసిన శివ స్వాములు వివేకానంద, సిద్ధ లింగస్వామి, బర్మయ్య, జ్యోతి స్వామి తదితరులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సామూహిక వివాహాలు సమాజంలో ఒక మంచి కార్యక్రమమని పేద కుటుంబాలకు అండగా నిలవడంతోపాటు పెళ్లిళ్లతో వారి కుటుంబాలు ఆర్థికంగా భారాన్ని మోయకుండా పవిత్రమైన శివ దీక్షలో ఉన్న శివ స్వాములు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా శివ స్వాములను అభినందిస్తూ డిసీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాదరావు వారికి తెలిపారు. తాము కోరిన వెంటనే ఒక మంచి కార్యానికి అండగా నిలిచేలా పెద్దమనసుతో పదివేల రూపాయలు వితరణ గా అందించినందుకు శివ స్వాములు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మిక్కిలినేని వెంకట శివప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలిపి నీకు ఈశ్వరుని ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హొళగుంద మాజీ సర్పంచ్ రాజా పంపన గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు బాబి, అలేఖ్య విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.