తల్లికి వందనం అమలుతో ప్రతి ఇంట్లో ఆనందం
1 min read
ఇచ్చిన మాటకు కట్టుబడి చిత్తశుద్ధితో పథకం అమలు
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకం వర్తింప చేసిన ప్రభుత్వం
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయడం ద్వారా ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి సరిగ్గా ఎడారి పూర్తయిన శుభ తరుణంలో రాష్ట్రంలోని విద్యార్ధుల తల్లులు అందరికీ తమ ప్రభుత్వం కానుక అందిస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా ‘సూపర్ 6’లో ఒకటైన ‘తల్లికి వందనం’ పథకం అమలు అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని ఎంపీ స్వాగతించారు. ‘తల్లికి వందనం’ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం రూ.8,700 కోట్లు విడుదల చేసిందని ఎంపీ తెలిపారు. పాఠశాలలు తెరిచేలోగా పథకం అమలు చేస్తామని ఇచ్చిన మాట యువనేత, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారని ఎంపీ స్పష్టం చేశారు. 1వ తరగతిలోనూ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనూ చేరే విద్యార్ధులకు కూడా ఈ పథకాన్ని తమ ప్రభుత్వం వర్తింప చేసిందని, సుమారు 11 లక్షల మంది వరకు ఉన్న వీరికి డేటా అప్లోడ్ కాగానే డబ్బులు జమ చేస్తారని ఎంపీ తెలిపారు. తల్లి లేని పిల్లలకు వారి తండ్రికి కానీ, లేదంటే సంరక్షుల ఖాతాలో కానీ డబ్బులు జమ చేస్తారని, అలాగే అనాథలైన పిల్లలకు జిల్లా కలెక్టర్ నిర్ధారించిన తర్వాత పథకం వర్తింప చేయటం జరుగుతుందని ఎంపీ వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలందరికీ కనిపించేలా ప్రదర్శిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. లబ్దిపొందే విద్యార్ధుల్లో బీసీలు 29.82 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు 11.76 లక్షల మంది, ఎస్టీ విద్యార్ధులు 4.26 లక్షల మంది, మైనారిటీ విద్యార్ధులు 66,500 మంది, ఈడబ్ల్యుఎస్ విద్యార్ధులు 8.44 లక్షల మంది ఉన్నారని ఎంపీ పేర్కొన్నారు. ఒక బిడ్డ ఉన్నా. నలుగురు ఉన్నా… అందరికీ తల్లికి వందనం పథకం లబ్ది చేకూరుతుందని, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుని.బటన్ నొక్కడం తప్ప చేసిందేమి లేదని, చేసింది గోరంత.చెప్పుకుంది కొండంతగా ప్రచారం చేసుకున్నారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎద్దేవా చేశారు. తల్లికి వందనం పథకంలో తమ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించలేదని, ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పథకాన్ని వర్తింప చేసిందని, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాత్రం ఒక్కరికి మాత్రమే పథకం వర్తింపజేసి తల్లులను మోసం చేసిందని ఎంపీ ఆరోపించారు. తమ ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు తల్లికి వందనం ఇస్తే, గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 42 లక్షల మందికే ఇచ్చిందని, గతం కన్నా 25 లక్షల మంది అదనంగా ఈసారి లబ్ది పొందుతున్నారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రూ.8,745 కోట్లు ఇస్తే, గతంలో రూ.5,540 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, గత ప్రభుత్వం కంటే రూ.3,205 కోట్లు అదనంగా ఈ పథకం కోసం తమ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఎంపీ వివరించారు. అంటే ఈ లెక్కన 5 ఏళ్ల కాలానికి వాళ్లకంటే రూ.16,000 కోట్లు ఎక్కువ ఇస్తున్నామని ఎంపీ తెలిపారు. సంక్షేమం అయినా అభివృద్ధి చేయాలన్నా అది తమ ప్రభుత్వానికే సాధ్యపడుతుందని నిరూపించినట్లు ఎంపీ స్పష్టం చేశారు.