అర్హులందరికీ ఇళ్ల పట్టాలు రాష్ట్ర మంత్రి టి.జి భరత్
1 min read
రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు : నగరంలో అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. మంగళవారం ఉదయం స్టేట్ గెస్ట్ హౌస్ లో మంత్రి టి.జి భరత్.. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, కర్నూలు ఆర్డిఓ సందీప్ కుమార్, కర్నూలు తహసిల్దార్ వెంకట రమేష్, అర్బన్ తహసిల్దార్ రవి, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన విధంగా కర్నూల్లో కూడా పంపిణీ చేసేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. నగరంలోని పంప్ హౌస్ సమీపంలో ఉన్న గూడెం కొట్టాల ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు వారికి పట్టాలు ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
డాటెడ్ ల్యాండ్ లో.. అభివృద్ధి పనులు
వెంకటరమణ కాలనీ మున్సిపల్ వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న నాలుగున్నర ఎకరాల డాటెడ్ ల్యాండ్ పోలీసు వారి దగ్గర నుండి కర్నూలు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల నిమిత్తం తీసుకోవటానికి కావలసిన చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఏ,బి,సి క్యాంప్ ల ప్రభుత్వ గృహ సముదాయాల్లో శిథిలావస్థకు చేరిన గృహాలను పూర్తిగా తొలగించి చదును చేయాలని ఆ స్థలాలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి అనుకూలంగా మార్చాలని ఆదేశించారు.