సీబీఎన్ బ్రాండ్తో ఉక్కు రంగంలో పెట్టుబడులు..
1 min read
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్
ముంబైలోని ఇండియా స్టీల్ 2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న టి.జి భరత్ బృందం
మంత్రి టి.జి భరత్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలను వివరించిన మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు: ఉక్కు రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ చెప్పారు. భారత ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు ఫిక్కి ఆధ్వర్యంలో ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో ఇండియా స్టీల్ 2025 పేరుతో ఉక్కు రంగంపై 6వ అంతర్జాతీయ ప్రదర్శన – సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్ బృందం పాల్గొనింది. ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుండి పెద్ద పెద్ద స్టీల్ కంపెనీల ప్రతినిధులు వచ్చారు. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు.ఎగ్జిబిషన్లో భాగంగా రాష్ట్ర మంత్రి టి.జి భరత్ అధ్యక్షతన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ – అపార అవకాశాలు పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ రాయ్, ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఈవై మాడరేటర్ వినాయక్ విపుల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి టి.జి భరత్ ముఖాముఖిగా మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దూరదృష్టితో హైదరాబాద్ ఇప్పుడు మహానగరంగా అభివృద్ధి చెందిన విషయాన్ని పెట్టుబడిదారులతో పంచుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. కేవలం సీబీఎన్ బ్రాండ్తోనే ఏపీకి పెట్టుబడిదారులు తరలివస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే ఎనిమిదిన్నర లక్షల కోట్ల పెట్టబడులు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. విజన్ 2029, స్వర్ణాంద్ర విజన్ 2047 లక్ష్యాలు పెట్టుకొని సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని కోరారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో రెండు దశల్లో రూ.1,47,162 కోట్ల వ్యయంతో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా మేనేజ్మెంట్ సంవత్సరానికి మొత్తం 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుందని వివరించారు. కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారుల ప్రశ్నలన్నింటికీ తాము సమాధానమిచ్చి వారి సందేహాలన్నీ నివృత్తి చేసినట్లు పేర్కొన్నారు. వీరితో నిరంతరం మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పారు.