PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏఐఎన్‌యూ ఆధ్వర్యంలో కిడ్నీ ర‌న్‌

1 min read

– ప్రపంచ కిడ్నీడే సంద‌ర్భంగా నిర్వహ‌ణ‌
– భార‌త‌దేశాన్ని మ‌ధుమేహం, ర‌క్తపోటు రాజ‌ధాని చేయొద్దు: ఏఐఎన్‌యూ వైద్యులు
– మూత్రపిండాల ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంచేందుకు ప్రపంచ కిడ్నీడే ఉప‌యోగ‌ప‌డాలని సూచ‌న‌
పల్లెవెలుగు వెబ్ హైద‌రాబాద్ : న‌గ‌రంలోని ప్రధాన ఆస్పత్రుల‌లో ఒక‌టైన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) ఆధ్వ‌ర్యంలో, హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌లో మూత్రపిండాల ఆరోగ్యంపై అవ‌గాహ‌న పెంచే ఉద్దేశంతో “ఏఐఎన్‌యూ కిడ్నీర‌న్” నిర్వహించారు. గ‌చ్చిబౌలి క్రీడాప్రాంగ‌ణంలో ప్ర‌పంచ కిడ్నీడే (మార్చి 9) సంద‌ర్భంగా 5కె, 10కె అనే రెండు విభాగాల్లో నిర్వ‌హించిన ఈ ర‌న్‌లో దాదాపు వెయ్యిమందికి పైగా పాల్గొన్నారు. మూత్రపిండాలు మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలు. శరీరంలోని వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఇవి చాలా అవసరం. మూత్రపిండాల ప్రధాన పని ర‌క్తంలోని విష‌ప‌దార్థాల‌ను శుద్ధి చేయ‌డం, వ్యర్థాలను మూత్రంగా మార్చడం. ఒక్కో కిడ్నీ 160 గ్రాముల బరువు ఉండి రోజుకు ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్ల మూత్రాన్ని విడుదల చేస్తుంది. రెండు మూత్రపిండాలు కలిసి ప్రతి 24 గంటలకు 200 లీటర్ల ద్రవాన్ని ఫిల్టర్ చేస్తాయి.ఈ ఏడాది ప్రపంచ కిడ్నీ దినోత్సవం థీమ్‌.. కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. మధుమేహం, రక్తపోటు ఎక్కువగా ఉన్న మనలాంటి దేశంలో ఈ రెండు జీవనశైలి వ్యాధులు మూత్రపిండాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి కాబట్టి కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.ఈ సంద‌ర్భంగా ఏఐఎన్‌యూ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాగూరి మాట్లాడుతూ, “మానవ శరీరంలో మూత్రపిండాలు కీలక అవయవాలు. శ‌రీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వాటి ప్రాముఖ్య‌త‌ను చాలా మంది విస్మరిస్తున్నారు. మ‌ధుమేహం ఉన్నవారు తమ మూత్రపిండాల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. శుద్ధి ప్రక్రియకు ఇది చాలా కీలకం. మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నమే ఏఐఎన్‌యూ కిడ్నీ రన్. వ్యక్తిగత ప్రయోజనాలు, సమాజ శ్రేయస్సు దృష్ట్యా చూసినా కిడ్నీ వ్యాధుల గురించి, వాటిని తగ్గించుకునే మార్గాల గురించి ఎక్కువ మందికి అవగాహన కల్పించాలనే ఈ ర‌న్ నిర్వ‌హించాం. దేశంలో మ‌ధుమేహ బాధితుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక మ‌ధుమేహ బాధితుల‌కు భారతదేశం నిలయంగా మారకుండా చూడటం, దాని వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం” అని చెప్పారు. ప్రపంచ కిడ్నీ డే అనేది మన మూత్రపిండాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ఉద్దేశించిన ప్రపంచ ప్రచారం. 2006లో ప్రారంభమైన ప్రపంచ కిడ్నీ డే అప్పటినుంచి క్ర‌మంగా మ‌రిన్ని దేశాల‌కు విస్తరిస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం, ఈ ప్రచారం ఒక నిర్దిష్ట థీమ్‌ను ప్రచారం చేస్తుంది. 2023 థీమ్‌ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ – ఊహించని స‌మ‌స్య‌ల‌కు సిద్ధం కావడం, నిస్సహాయులకు మద్దతు ఇవ్వడం.

About Author