కిడ్నీలను సంరక్షించుకుందాం..
1 min read
ఐఎంఏ జాయింట్ సెక్రటరి, సీనియర్ కిడ్నీ వైద్య నిపుణులు డా. వై. సాయివాణి
కర్నూలు, న్యూస్ నేడు: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు కిడ్నీల పాత్ర కీలకమని, అటువంటి కిడ్నీలను ఆరోగ్యంగా సంరక్షించుకోవాలని సూచించారు ఐఎంఏ జాయింట్ సెక్రటరి, సీనియర్ కిడ్నీ వైద్య నిపుణులు డా. వై. సాయి వాణి. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా గురువారం నగరంలోని రాజ్ విహార్ సర్కిల్ నుంచి కొండా రెడ్డి బురుజు వరకు కిడ్నీలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రవీంద్ర విద్యా సంస్థల అధినేత డా. పుల్లయ్య ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. సాయివాణి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి లక్షణాలు చివరి దశలో తెలుస్తాయని, ప్రారంభ దశలో గుర్తిస్తే కొంత మేలు జరుగుతుందన్నారు. మధుమేహం, ఊబకాయం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని, అటువంటి వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలన్నారు. కిడ్నీ వ్యాధులకు నిర్వహించే చికిత్స వల్ల నీరు చాలా వృథా అవుతుందని, (డయాలసిస్ ) మరియు ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వస్తాయని పేర్కొన్నారు. బీపీ, షుగర్, ఊబకాయం, గుండె సమస్యలు ఉన్న వారు ఏడాదికోసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం మేలని సూచించారు. ఐఎంఏ సెక్రటరి డా. రామ్మోహన్ రెడ్డి, ట్రెజరర్ డా. మాధవి శ్యామల, ఐఎంఏ ఉమెన్ వింగ్స్ టీం సెక్రటరి డా విష్ణు ప్రియ, డిపార్ట్ మెంట్ ఆఫ్ నెఫ్రాలజి హెచ్ఓడి డా. అనంత్, సీనియర్ వైద్యులు, నర్సింగ్ స్టూడెంట్స్, పుల్లయ్య కాలేజి విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
