PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదర్శ మహిళా అభ్యుదయ వాది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ

1 min read

– లలితా పీఠంలో అత్యంత వైభవంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 293 జయంతి వేడుకలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 293 సంవత్సరాలకు పూర్వమే అనాచారాలకు వ్యతిరేకంగా సంఘ సంస్కరణకు శ్రీకారం చుట్టిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నాటికి నేటికి మహిళా లోకానికి ఆదర్శ శిరోమణి అని తెలుగు పండితులు ధార్మిక ప్రవచకులు డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని అన్నారు. తరిగొండ వెంగమాంబ జయంతి మరియు నృసింహ జయంతి వేడుకల సందర్భంగా లలితా పీఠం కర్నూలు నందు తరిగొండ వెంగమాంబ సేవా సమితి ఆధ్వర్యంలో వెంగమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు వెంగమాంబ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో మొట్టమొదటి అన్నదాత తరిగొండ వెంగమాంబ అని, అందుకే నేడు తిరుమలలో నిత్యాన్నదాన కేంద్రానికి ఆమె పేరుతోనే నేటికీ అన్నదానం జరుగుతున్నదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు, అష్టఘంటికలు ఏర్పాటు చేసి తాను రచించిన రచనలకు ప్రతులు తయారు చేయించి విశేషమైన సాహితీ కృషి చేసిన వెంగమాంబ కడు పూజ్యురాలని తరిగొండ వెంగమాంబ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పసుపులేటి నీలిమ అన్నారు. ప్రముఖ యోగా గురువు పెరుమాళ్ళ దత్తయ్య మాట్లాడుతూ గురు సుబ్రహ్మణ్యం ద్వారా ఉపదేశం పొందిన వెంగమాంబ అనతి కాలంలోనే యోగసాధనలో ఉన్నత స్థాయికి చేరుకుందన్నారు. హిందీ అధ్యాపకురాలు ధార్మిక ప్రవచకులు హరీబెళ్ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ అక్షరశారదా సాక్షాత్కారం పొందిన ఏకైక విదుషీమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నారు. లలితా పీఠం పీఠాధిపతులు మేడా సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ సేవా సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి ఎన్నెన్నో సేవలు చేస్తున్న పసుపులేటి నీలిమ ఈ తరానికి ఆదర్శమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సేవా సమితి సభ్యులు పి.జనార్ధన్, రత్నమ్మ, అనురాధ, శరవణ, కేశవరావు, సాయిలీల , జి.ప్రవీణ్, శివజ్యోతి, లలిత , కళ్యాణ్ తోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author