తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం నగరపాలక సంస్థలో పనిచేసే నాన్-పబ్లిక్ హెల్త్ వర్కర్లు వేతనాల పెంపు విషయమై, విధులను బహిష్కరించి సమ్మెలోకి వెళ్ళిన నేపథ్యంలో, నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాగునీటి సరఫరా విభాగం సిబ్బంది ఈ నెల 10వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్ళారని, అయినప్పటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే పైప్లైన్ జంక్షన్ల వద్ద వాల్ తిప్పితే ఏయే ప్రాంతానికి నీళ్ళు వెళ్తాయో అనేది ప్రత్యామ్నాయ సిబ్బందికి సరైన అవగాహన లేక కాస్తా ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. సాధ్యమైనంత మెరుగ్గా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు నగరపాలకకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.