PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ నాయకుల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రించాలి.. టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ నాయకుల గొప్పతనం నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్ అభిప్రాయపడ్డారు. నగరంలోని ఆర్ఎస్ రోడ్డు సర్కిల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొప్ప నాయకుల జీవిత చరిత్ర తెలుసుకొని నేటితరం రాజకీయ నాయకులు ముందుకు వెళ్లాలన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలు చేయాలన్నారు. జాతీయ నాయకుల గొప్పతనం నేటి తరానికి తెలియాలంటే కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ లాంటి గొప్ప వ్యక్తి తో పాటు బాబు జగ్జీవన్ రామ్ లాంటి గొప్ప వ్యక్తుల ఫోటోలు కూడా ముద్రించేందుకు ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక దళితులు ప్రధాని కావాలని ఆ వర్గం కోరుకుంటుందని వారి అభిప్రాయాలను అందరూ గౌరవించాలన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని టిజి భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు గున్న మార్క్, శివన్న, జూటూరు రవి, రాజ్ కుమార్, ఏసన్న, ఈశ్వర్, ప్రసాద రావు, అనంతరత్నం, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

About Author