PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సప్తనదుల సంగమక్షేత్రం..సంగమేశ్వరం..!

1 min read

నల్లమలలో వెలసిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం..

శివుడు వేపదారు శివలింగం రూపంలో పూజలు అందుకోవడం ప్రత్యేకత.

ప్రపంచంలోనే ఒకే చోట ఏడు నదులు కలిపిన ప్రదేశం సంగమేశ్వరం.

రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్య క్షేత్రం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని  కొత్తపల్లి మండలంలో  సంగమేశ్వర క్షేత్రం ఉంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర ,మలాపహరిణి, భీమరథి భవనాసి లు ఒక్కటిగా కలిసే ప్రాంతం ఇది. ఈ ఏడు నదులు కలిసేచోట దక్షయజ్ఞం జరిగిందని, సతీదేవి తన శరీర నివృత్తి చేసిన స్థలం ఇదేనని, అందుకే ఈ క్షేత్రానికి నివృత్తి సంగమేశ్వర క్షేత్రం అని అంటారని స్కాందపురాణంలో వుంది.

స్థలపురాణం..

పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధి కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపదారు శివ లింగం..

సప్త నది సంగమ క్షేత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ధర్మరాజు వనవాస సమయంలో ప్రతిష్టించిన వేప దారు శివలింగం ఇక్కడ ప్రముఖంగా పూజలందు కుంటుంది. భీముడు ప్రతిష్టించిన భీమ లింగం.ఆలయం శ్రీశైలం నీట మునిగి పోయాక ఇక్కడి బీమ లింగం పగిడ్యాల మండలం బీరవోలు గ్రామంలో కేసి కాలువ గట్టున ప్రతిష్టించారు.  విశ్వామిత్రుడు  గృహాలు, విశ్వామిత్రుడు తపస్సుకు మెచ్చి గోపాలగిట్ట రూపంలో దర్శనమిచ్చిన గాయత్రి దేవి పాదముద్రికలు. ద్రౌపతి దేవి క్షేత్ర సందర్శన సమయంలో పాయసం వండిన ప్రదేశాలు, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి. క్షేత్ర ఆవరణంలో రుద్రాక్ష మండలం ఉంది. విజయనగరం సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు ఇక్కడికి రెండు పర్యాయాలు సందర్శించినట్లు చెబుతారు. ఆ సమయంలో దేవుడి పేర మాన్యం భూములు ప్రకటించి శిలా శాసనాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. మహా చక్రవర్తి శివాజీ మహారాజ్ కూడా సంగమేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన తర్వాతే శ్రీశైలం భ్రమరాంబ దేవి అనుగ్రహాన్ని పొందినట్లు చెబుతారు.

రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రం..

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.  ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు.

ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం…

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

1980లో నీట మునిగిన ఆలయం..

శ్రీశైలం డ్యామ్ నిర్మించిన తర్వాత 1980లో సప్తనదీ సంగమేశ్వరం కృష్ణమ్మ గర్భంలోకి చేరుకుంది. అప్పటి నుంచి 24 సంవత్సరాలపాటు జలాధివాసం ఆయన సంగమేశ్వరం 2000లో బయట పడి భక్తులచే పూజలందుకుంటున్నాడు. అయితే నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ ఎనిమిది నెలలు జలాధివాసం లోనే ఉంటాడు.18 సంవత్సరాలలో లో మహా శివరాత్రి పర్వదినానికి 12 సార్లు భక్తులకు దర్శనమివ్వడం విశేషం.

క్షేత్రాన్నికి భక్తులు చేరుకోవాలంటే…

కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న ‘మచ్చుమర్రి’ గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని, అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. స్వంతవాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి  క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌.టి.సి.వారు బస్సులను నడుపుతారు.తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.

About Author