PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పకడ్బందీ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

1 min read

– మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు సిద్ధం చేయండి
– సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్*
పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో ఈ నెల 11 నుండి 21 వరకు 11 రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించి భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు లోను కాకుండా పకడ్బందీ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్ సంబంధిత* *అధికారులను ఆదేశించారు. బుధవారం అన్నపూర్ణ భవనం ప్రక్కన గల సీసీ కంట్రోల్ రూమ్ నందు జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి,జాయింట్ కమిషనర్ అండ్ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నలతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 11 నుండి 21 వరకు 11 రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులకు కేటాయించిన విధులను సమన్వయంతో సక్రమంగా నిర్వర్తించి ఏ ఒక్క చిన్న పొరపాటు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఉత్సవాల పటిష్ట నిర్వహణకు శ్రీశైలాలయాన్ని 10 జోన్లు, 40 సెక్టార్లుగా విభజించి జిల్లాస్థాయి అధికారులకు ఇంచార్జులుగా నియమించామని ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సదుపాయం తదితర అంశాలపై అప్పగించిన విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని సంబంధిత జోనల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా సంబంధిత అధికారులతో కో ఆర్డినేట్ చేసుకోవాలని, ఏ సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ నెల 11 నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి వచ్చే అవకాశం ఉన్నందున సాంకేతిక సమాచార లోపం తలెత్తకుండా టెలిఫోన్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను పెంచాలని బిఎస్ఎన్ఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏరియా హాస్పిటల్ లో తాత్కాలిక బ్లడ్ బ్యాంక్, తాత్కాలికంగా ఏర్పాటు చేసే 30 పడకల ఆసుపత్రి 24 గంటలపాటు నిర్వహించేలా వైద్యసిబ్బందిని కేటాయించాలని డి.ఎం. అండ్ హెచ్.ఓను ఆదేశించారు. ముఖ్య ప్రదేశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో రెండు షిఫ్టులలో వైద్యులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏడు 108 అంబులెన్సులు, పాదయాత్రమార్గములో ఒక అంబులెన్సును ఏర్పాటు చేయాలని సూచించారు. కాలినడక ప్రాంతంలో సమాచార వ్యవస్థ లేని కారణంగా తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జియో, బిఎస్ఎన్ఎల్ తదితర కమ్యూనికేషన్ అధికారులను కలెక్టర్ సూచించారు. అలాగే కాలినడక భక్తులకు ప్రమాదవశాత్తు సమస్యలు వస్తే డోలీలు, స్ట్రేచర్లు ఏర్పాటు చేసుకోవాలని వైద్య, దేవస్థానం అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాదయాత్రికులను పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను సూచించారు. బ్రాహ్మణకొట్కూరు నుండి శ్రీశైలం వరకు గతంలో సూచించిన విధంగా 24 ప్రదేశాలలో తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాలలో పుణ్యస్నానాలాచరించేందుకు అనుమతిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి 338 మంది గజ ఈతగాళ్ళ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన లైఫ్ జాకెట్లు, పుట్టీలు ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం, టూరిజం శాఖల నుండి తెప్పించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాత్కాలిక టాయిలెట్లు, డ్రస్సింగ్ గదులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డిడిని, దేవస్థానం పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ భారీ వాహనాలను అటవీమార్గంలో అనుమతించకుండా డైవర్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రకాశం, నాగర్ కర్నూలు, కర్నూలు జిల్లాల ట్రాన్స్‌ఫోర్ట్, సంబంధిత ట్రాఫిక్ డిస్పీలను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతల పరిరక్షణకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పార్కింగ్ ప్రదేశాలలో దాదాపు 3వేల వాహనాలను నిలుపుదల చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి తాను, కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్‌ యంత్రాంగానికి అన్నిశాఖల అధికారులు సహకరించాలని ఆయన కోరారు. పాగాలంకరణ ముగిసిన వెంటనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.అంతకుముందు కైలాస ద్వారం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని కలెక్టర్, ఎస్పీలు సందర్శించి స్వయంగా భక్తులకు అన్నదాన వితరణ చేసారు. అలాగే పాతాళ గంగ, ఆర్.టి. సి.బస్టాండ్, ఆగమ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్లమ్మ మందిరం, కైలాస ద్వారం సమీప ఆవరణలలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలను వారు తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.

About Author