సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ
1 min read
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
తల్లికి వందనం పథకంలో సంబంధిత అధికారులు అధ్యయనం చేసి దృష్టి సారించాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: తల్లికి వందనం పథకంలో పలువురు తల్లులు లబ్దిపొందేందుకు అడ్డంకిగా మారిన ఇబ్బందులపై పూర్తి అధ్యయనం చేసి,వాటిని తొలగించే అంశంపై దృష్టిసారించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాహితమైన సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే విషయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ వస్తున్నారు. ఇదేక్రమంలో తల్లికి వందనం పథకంలో అర్హులుగా పరిగణించిన పలువురు తల్లుల ఖాతాలకు లబ్ది సొమ్ములు జమకాక పోవడంతో ఈ సమస్యకు చెక్ పెట్టి, అర్హులకు ఆ లబ్దిని చేకూర్చేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి చూపుతోన్న చొరవ అధికారులు, సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇదేక్రమంలో మంగళవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయం నుండి ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఎ.భానుప్రతాప్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు,అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పరిధిలోని సచివాలయాల్లో పనిచేస్తోన్న అధికారులు, సిబ్బందితో ఎమ్మెల్యే చంటి జూమ్ కాన్ఫెరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తల్లికి వందనం పథకం వర్తింపులో కొందరు తల్లులకు ఎదురైన సాంకేతిక సమస్యలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఆయన యాక్ట్ న్యూస్తో మాట్లాడుతూ తల్లికి వందనం లబ్దిపొందని అర్హులైన తల్లులకు సత్వర న్యాయం చేయాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవ్వరూ అధైర్యపడొద్దని,అన్నివిధాలా అండగా ఉంటానని ధైర్యంచెప్పారు. కార్యక్రమంలో ఏలూరు అర్భన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.