PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలి

1 min read

– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేలా  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన బ్యాంకర్లను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్  లోని సమావేశ మందిరంలో  జిల్లా స్థాయి బ్యాంకర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లా రుణ ప్రణాళిక లక్ష్యం రూ.12,320.64 కోట్లు కాగా, బ్యాంకర్స్  రూ.8,253.86 కోట్లు రుణాలు మంజూరు చేసి 67 శాతం  లక్ష్యాన్ని సాధించారన్నారు. ప్రధానంగా వ్యవసాయ అనుబంధ శాఖలకు ఈ సంవత్సరంలో 6,792 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.4656.3 కోట్ల రుణాలు మంజూరు చేసి  68.55 శాతం సాధించడం జరిగిందన్నారు. అదే విధంగా చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధికి గాను ఈ సంవత్సర లక్ష్యం రూ.2082.59 కోట్లు కాగా, అందుకుగాను రూ.1429.5 కోట్లు మంజూరు చేసి  68.64 శాతాన్ని సాధించామన్నారు.  ప్రయారిటీ సెక్టర్ కు సంబంధించి 10,059.79 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించగా, అందుకు గాను రూ.6,377.2 కోట్లు లక్ష్యానికి చేరామన్నారు.  ప్రయారిటీ సెక్టార్ కు సంబంధించి లోన్స్ ఇవ్వడంలో ప్రభుత్వ యేతర బ్యాంకులు తక్కువ శాతం పురోగతి సాధించారని వచ్చే సమావేశం నాటికి మెరుగైన పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత బ్యాంకు అధికారులను ఆదేశించారు. అదే విధంగా చేనేతకు చెందిన ముద్రా రుణాలు మంజూరు చేయడంలో ఏపిజిబి, కెనరా బ్యాంక్, ఎస్బిఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులలో ఎమ్మిగనూరుకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్ ఉన్నాయని ముఖ్యంగా  ఎమ్మిగనూరు ప్రాంతం చేనేత హబ్ గా ఉన్నప్పటికీ  ముద్ర రుణాలు మంజూరు చేయడంలో ఎందుకు బ్యాంకులు అలసత్వం వహిస్తున్నారని,  అలసత్వం వహించడం సరికాదని త్వరితగతిన ముద్ర రుణాలను మంజూరు చేసి వారికి ఆర్థికంగా, సామాజికంగా చేయూతను అందించాలన్నారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి బ్యాంకుల నుండి ఇవ్వాల్సిన ఋణాలు తక్కువగా ఇస్తున్నారని అందులో  పురోగతి సాధించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రయోజిత పథకాలైన ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ లకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయడమే కాక ఎంఎస్ఎంఈ యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్ లను కలెక్టర్ ఆదేశించారు.మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద వెజిటబుల్ సోలార్ డ్రైయర్స్ కొరకు 216 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందని అయితే అందులో  161 అప్లికేషన్లు శాంక్షన్ చేయడం జరిగిందని 35 అప్లికేషన్లు వివిధ కారణాల ద్వారా రిజెక్ట్ చేయడం జరిగిందని పెండింగ్లో ఉన్న 20 అప్లికేషన్లు త్వరితగతిన అప్రూవ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత బ్యాంక్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.సిసిఆర్సి కార్డ్స్ కి సంబంధించి బ్యాంకుల వద్ద పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ ని పరిశీలించి కౌలు రైతులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని  బ్యాంక్ అధికారులను ఆదేశించారు.టిడ్కో గృహాలకు సంబంధించి బ్యాంకులు లోన్లు ఇవ్వడంలో ఆలసత్వం వహిస్తున్నారని,  ఆదోని బ్యాంకు నందు 9 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని త్వరితగతిన లోన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.సహకార బ్యాంకు సి ఈ ఓ రామాంజనేయులు మాట్లాడుతూ సహకార బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా, మరియు 2 లక్షల రూపాయల జీవిత భీమా ఇన్సూరెన్స్ ఉచితం గా అందిస్తున్నామని తెలియజేశారు. సమావేశంలో ఆర్బిఐ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రెహమాన్, ఎల్డిఎం రామచంద్ర రావు, నాబార్డ్ డిడిఎం సుబ్బారెడ్డి, ఎస్బిఐ రీజనల్ మేనేజర్ సూర్య ప్రకాష్, కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ రఘువీర్, వివిధ బ్యాంకుల జిల్లా అధికారులు,మేనేజర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author