పదోతరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
1 min read
సెల్ ఫోన్లకు అనుమతి లేదు
జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సిఎస్ కె. విజయానంద్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస నేడు : రాష్ట్రంలో మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే పదోతరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం ఎస్.ఎస్.సి పరీక్షలకు సంసిద్ధత, రాబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కోసం సూచనలు, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం, సానుకూల ప్రజా అవగాహన, పి4 మోడల్ సర్వే, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా పదోతరగతి పరీక్షల నిర్వహణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఇతర చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వణపై సోషల్ మీడియాలో ఎటువంటి రూమర్ల కు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 24, 25 తేదీల్లో నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సంసిద్ధత కావాలన్నారు. ప్రతీ నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛఆంధ్ర-స్వచ్ఛఆంధ్ర దివాస్ కార్యక్రమాన్ని అర్దవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. సానుకూల ప్రజా అవగాహన, పి4 మోడల్ సర్వే, తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, వివిధ శాఖల జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు నిర్ధేశించిన అంశాలపై సమగ్ర నివేదికలను రూపొందించాలన్నారు. మార్చి 17 నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్షా పత్రాలు భధ్రపర్చే కేంద్రంలో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి 17 నుండి 31 వరకు 10 వ తరగతి రెగ్యులర్ వారికీ, 17 నుండి మార్చ్ 28 వరకు ఓపెన్ స్కూల్స్ విద్యార్ధులకు 10 వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.45 వరకు జరుగుతాయన్నారు. రెగ్యులర్, ప్రైవేటు కలిపి జిల్లాలో 133 కేంద్రాల్లో 25,179 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని తెలిపారు. ఓపెన్ స్కూల్స్ నుండి 793 , మంది విద్యార్ధులకు గానూ 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో అవసరమగు బస్సులను నడపాలని, సంబంధిత సమయాలను ముందుగా పత్రికా ముఖంగా తెలియజేయాలని ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షలు కట్టుదిట్టంగా, ఎక్కడా కాపీ జరగకుండా నిర్వహించాలన్నారు. పరీక్షలు నిర్వహించే సమయంలో అన్నిపరీక్షా కేంద్రాల పరిధిలో 163-బి సిఆర్ పిసి సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలను, నెట్ సెంటర్లను మూసి వేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ముందస్తుగా పరిశీలన చేసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపివో వాసుదేవరావు, డిఈఓ వెంకట లక్ష్మమ్మ, డివిఈఓ ప్రభాకరరావు, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, డ్వామా సుబ్బారావు , డిపివో కె. అనురాధ, ఆర్ టి సి డిఎం బి. వాణి,డిఎంహెచ్ఓ డా. ఆర్.మాలిని, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.