PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పింఛన్ల పంపిణీపై జాగ్రత్తలు తీసుకోండి

1 min read

ఉపాధ్యాయ అర్హత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పింఛన్ల పంపిణీపై అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పింఛన్ దారులందరికీ మంగళవారం సాయంత్రం లోగా వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష, స్వర్ణాంధ్ర @2047, ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జిల్లాలో 2.18 లక్షల మందికి 92 కోట్ల రూపాయల పంపిణీ చేయాల్సి ఉందని ఇందుకు సంబంధించి నగదును డ్రా చేసుకొని మంగళవారం ఉదయం 6 గంటల నుండే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సాధ్యమైనంతవరకు అదేరోజు సాయంత్రంలోగా 100% పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగదు బట్వాడా, పంపిణీ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎలాంటి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించకూడదన్నారు. పెన్షన్ పంపిణీ సంబంధించి లబ్ధిదారులు మరణించినా, వలసలు వెళ్లినా సంబంధిత లబ్ధిదారుల మొత్తాలను గత మూడు నెలల నుంచి తిరిగి జమ చేయలేదని ఇందుకు సంబంధించిన ఫైల్ ను తనకు పంపవలసిందిగా డిఆర్డిఏ పిడిని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో 8,800 మంది ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో ఈనెల 3 నుండి 21 వరకు జరిగే ఆన్లైన్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని విజయవంతం చేయాలని ఆర్డిఓ, డిఈఓ లను కలెక్టర్ ఆదేశించారు. ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్, శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలలో నిర్వహించే టెట్ ఆన్లైన్ పరీక్షలలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య, మంచినీరు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు చాల రొజుల నుండి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు, వైద్య శిబిరాలు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.స్వర్ణాంధ్ర@2047 ప్రణాళికకు రూపకల్పనకు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ప్రజల అభిప్రాయాల సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరిచేత చేయించాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలకు ర్యాంకింగ్ ఇస్తున్నందున ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాను చెత్త రహిత జిల్లాగా మార్చేందుకు  పంచాయతీ, మున్సిపల్ సంబంధిత శాఖలు పారిశుద్ధ సిబ్బందితో చిత్తశుద్ధితో పనులు చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాను పర్యటించే ప్రదేశాలలో రోడ్లకు ఇరువైపులా చెత్త కనపడరాదన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రం చేస్తున్న కార్యక్రమాలు ఫోటోలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కార్యచరణ ఉండాలని ఆమె అధికారులను సూచించారు. పెండింగ్ లో ఉన్న ఓటర్ల జాబితా సవరణను వెంటనే పూర్తి చేయాలని ఈఆర్వో, ఏఈఆర్వోలను కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ మాట్లాడుతూ జిల్లాలో 29 వేల ఎకరాలకు సంబంధించి ఫ్రీ హోల్డ్ భూముల పరిశీలన ప్రారంభించామని….  ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరిగిందో సంబంధిత భూములను రీ వెరిఫై చేసి సంబంధిత నివేదికలను సమర్పించాలని జాయింట్ కలెక్టర్ మండల తాసిల్దారులను ఆదేశించారు. మండలంలో భూములను క్రయ విక్రయాలు జరిపినా, మైగ్రేట్ చేసినా సంబంధిత భూములన్నింటినీ పరిశీలించాలన్నారు. భూములకు సంబంధించిన ప్రతి లావాదేవీలు క్లియర్ గా ఉండాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

About Author