PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లింలకు అండగా ఉంటా: టీజీ భరత్​

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ముస్లింలకు అండగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఉంటుందని కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 48వ వార్డు పరిధిలోని ప్రకాష్ నగర్ రోజా ప్రాంతంలో ఆయన టి.జి భరత్ భరోసా యాత్ర అనే కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి ముస్లిం సోదరులను, మహిళలను, యువతను కలిసి మాట్లాడారు. ఈ ఐదేళ్లలో ముస్లింలు ఎంతో నష్టపోయారని చెప్పారు. ముస్లింలందరూ ఓటు వేసి గెలిపించిన నాయకులు ముస్లింలకు ఏమి చేయలేదని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ముస్లింలకు అండగా ఉండి అన్ని సంక్షేమ పథకాలు అందజేసి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లింలకు ఎంతో ఉపయోగపడే దుల్హన్ పథకానికి ఈ ప్రభుత్వం నిబంధనలు పెట్టడం వల్ల అర్హులకు అందకుండా పోయిందన్నారు. తమ ప్రభుత్వం వస్తే ముస్లింలకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేలా చంద్రన్న రంజాన్ కానుకను మళ్ళీ అందిస్తామన్నారు. ముస్లింలందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. కర్నూల్లో తనను గెలిపిస్తే ముస్లింలందరికీ మంచి భవిష్యత్తు అందిస్తానని టి.జి భరత్ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో అమలు చేసే ఉచిత ఇసుక విధానం వల్ల పనులు పెరుగుతాయని చెప్పారు. వార్డు పర్యటనకు వచ్చిన టి.జి భరత్ కు స్థానికులు సమస్యలు చెప్పుకున్నారు. తాను గెలిచాక అన్నింటినీ క్రమ పద్ధతిలో పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మన్సూర్ ఆలీఖాన్, దేవా, ముంతాజ్, శ్యామ్, రఫిక్, ఖాజా, అంజాద్ ఖాన్, సద్దాం, బాస్కర్, బూత్ ఇంఛార్జీలు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author