PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీతో టీడీపీ జ‌ట్టు .. ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ చాలా రోజుల‌ తర్వాత మళ్లీ బీజేపీతో జట్టు కట్టబోతోందని సమాచారం. కేంద్రంలోని ఎన్డీఏలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ చేరబోతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాబోయే దసరా లేదా దీపావళి నాటికి ఎన్డీఏలో టీడీపీ చేరిక ఉంటుందని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది ఇండియన్ఎక్స్ ప్రెస్’ ఢిల్లీ ఎడిషన్ రాసిన కథనం సంచలనంగా మారింది. పొత్తు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు మాట్లాడారని, అలాగే అమిత్ షాతో నారా లోకేశ్ సమావేశమై మంతనాలు సాగించారని పేర్కొంది. ‘ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో విభేదించి టీడీపీతో జతకట్టేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. టీడీపీ నిర్వహించిన శాంపిల్ సర్వేల్లో రాష్ట్రంలో బీజేపీ ఓట్ల శాతం కేవలం 3 నుంచి 4 శాతంగా ఉందని తేలింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నందున టీడీపీ పొత్తు పెట్టుకుంటే తమ బలం పుంజుకుంటుందన్నది బీజేపీ వాదన. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి పెద్దగా ఫలితం ఉండకపోగా, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుతుందని పోల్ సర్వేలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలు వేరయి విచ్ఛిన్నమవుతున్న ఎన్డీయేలో టీడీపీ చేరడంపై పండుగ సీజన్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది’ అని ప్రముఖ జర్నలిస్ట్ కూమి కపూర్ ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు రాసిన కథనంలో పేర్కొన్నారు. టీడీపీ గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. తెలంగాణ విడిపోయిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసే పోటీ చేసింది. మరోవైపు ఏపీలో అధికార వైసీపీ.. కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది.

                               

About Author