NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్రబాబు విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలి.. టి.జి భరత్

1 min read

– రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూల్లో ప్రజల నుండి సంతకాల సేకరణ చేపట్టిన టి.జి భరత్

– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పుస్తకాలు పంపిన టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపేందుకు ఆయన ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం ఇది వరకే చేపట్టారు. శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఆయన సంతకాల సేకరణ పుస్తకాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలోని అన్ని వార్డుల్లో ప్రజల నుండి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. మొదటి విడతగా ఇప్పటి వరకు పూర్తయిన సంతకాల సేకరణ పుస్తకాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అందుకే దేశానికే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంలో స్పందించాలన్నారు. ఆయన దృష్టికి విషయం తీసుకెళ్తున్నామని భరత్ చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. ఈ విషయంలో ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారన్నారు. వెంటనే చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని, వెంటనే ఆయన్ను విడుదల చేయాలని టి.జి భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు నాగేశ్వర రావు యాదవ్, నాగరాజు యాదవ్, పరమేష్, ఊట్ల రమేష్, గున్నామర్క్, బొల్లెద్దుల రామకృష్ణ, బాలు, చెన్న, తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author