NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మార్పులతో నగర రూపురేఖలు మార్చాలి

1 min read

నగరపాలక అధికారులతో మంత్రి టీజీ భరత్

ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాలపై సమీక్ష

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి

కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగర రూపురేఖలు మార్చేందుకు అవసరమైన మార్పులు చేపట్టి, కర్నూలును రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్, నగరపాలక అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్‌ యస్.రవీంద్ర బాబుతో కలిసి ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులు, ప్లానింగ్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించారు.ముందుగా గుత్తేదారులతో మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, లెస్‌లకు 5% కంటే ఎక్కువ పోవద్దని సూచించారు. 5% కంటే ఎక్కువ లెస్‌లకు టెండర్ వేసిన పనులపై, క్వాలిటీ కంట్రోల్ బోర్డు ద్వారా నాణ్యత ప్రమాణాలు తనిఖీలు చేశాకే బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా పనులు దక్కించుకుని ప్రారంభించకుండా జాప్యం చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు.అనంతరం పట్టణ ప్రణాళిక విభాగ అధికారులతో, ప్లానింగ్ కార్యదర్శులతో మాట్లాడారు. నగరాన్ని సుందరంగా, అందంగా ఉండాలంటే పట్టణ ప్రణాళిక సిబ్బంది పర్యవేక్షణ చాలా కీలకమైనదన్నారు. ఆక్రమణలు‌ ఉపేక్షించొద్దని, దీనిపై పైస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.  వెండర్స్ జోన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలని, బహిరంగ ప్రదేశాల రహదారులపై తోపుడు బండ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో వీధి వ్యాపారులు ఎంతమంది ఉన్నారో, అనుమతులు ఎంత మంది తీసుకున్నారో వంటి వివరాలను వారంలోగా తనకు అందజేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో రహదారుల ఆక్రమణలపై చర్యలు తీసుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆలస్యం చేయోద్దని స్పష్టం చేశారు. రహదారులపై, కూడళ్లపై బ్యానర్లు, పోస్టర్లు అతికించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వ్యక్తులు జరిమానాతో వినకపోతే, కేసులు నమోదు చేసేందుకు వెనకాడొద్దని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించే ఆక్రమణలు తక్షణమే తొలగించాలని, ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అన్వేషించి వెండర్ జోన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాంతాలు సుందరంగా తీర్చిదిద్దేందుకు, క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది ప్రణాళిక రూపొందించాలని, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, ఇంచార్జీ ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ లీల ప్రసాద్, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అంజాద్ బాష, కార్పొరేటర్ పరమేష్, డిఈఈలు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *