జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం లేకుండా చేయాలి..
1 min read
జిల్లాలో గంజాయి సాగు, మత్తు పదార్థాల సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టే విధంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో గంజాయి సాగు, మత్తు పదార్థాల సరఫరా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టే విధంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ (NCORD) సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలని అధికారులను ఆదేశించారు.. ముఖ్యంగా యూనివర్సిటీలు, మెడికల్ కళాశాలలు, ఇతర కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగం లేకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే దాచి పెట్టవద్దని, విద్యార్థుల భవిష్యత్తు కు సంబంధించిన అంశమని, వెంటనే పోలీస్ కు సమాచారం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ప్రతి పాఠశాల, కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్ధాలు, టోల్ ఫ్రీ నంబర్ వివరాలతో శాశ్వతంగా ఉండే విధంగా హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ డీఈవో ను ఆదేశించారు…పొలాల్లో గంజాయి సాగు గురించి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వీఆర్వో ల ద్వారా సమాచారం తీసుకుని పోలీసు శాఖకు అందించాలని ఆదోని సబ్ కలెక్టర్, ఆర్డీవో లను ఆదేశించారు..ఎక్సైజ్, అటవీ శాఖల అధికారులు కూడా గంజాయి సాగు, మత్తు పదార్థాల వినియోగం పట్ల నిఘా ఉంచాలని ప్రాంతాల్లో కూడా గంజాయి సాగుపై నిఘా ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి పాఠశాలల్లో వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, ర్యాలీలు, ప్రతిజ్ఞ ల ద్వారా విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని డీఈవో ను ఆదేశించారు.. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకోవాలని ఎస్పీ డిఈఓ కు సూచించారు. మిరప పంట మధ్యలో గంజాయి సాగు చేసే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ వారు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు గంజాయి సాగు చట్టపరంగా నేరం అనే విషయం పూర్తిగా అర్థమయ్యేలా వివరించాలని ఎస్పీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు. కర్నూలు నగరంలో ఉన్న వార్డు సెక్రటేరియట్ లు వచ్చే ఫిర్యాదులను పోలీస్ శాఖకు అందించేలా అడ్మిన్ సెక్రటరీకి తగిన ఆదేశాలు జారీ చేయాలని ఎస్పీ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. బస్సులు, రైళ్ళ ద్వారా వీటి రవాణాను పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఈ అంశంపై డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కల్పించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల వినియోగానికి పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ పి పేర్కొన్నారు.సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, అదనపు మున్సిపల్ కమీషనర్ ఆర్జీవి కృష్ణ, ఎక్సైజ్ సూపరిన్టెండెంట్ సుధీర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.