PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయులపై వేధింపులు ఆపకపోతే మూల్యం చెల్లించక తప్పదు

1 min read

– ఫ్యాప్టో చైర్మన్ యస్. గోకారి విజ్ఞప్తి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పాఠశాలల సందర్శనల పేరుతో ఉపాధ్యాయులను వేధించడం మానుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖాధికారులు తగు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) కర్నూలు జిల్లా చైర్మన్ యస్. గోకారి హెచ్చరించారు.పాఠశాల సందర్శన పేరుతో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం, వేధించడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మధ్యాహ్నం కర్నూలు పట్టణంలోని మాంటిస్సోరి హైస్కూల్ నందలి పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా యస్. గోకారి అధ్యక్షత వహించి మాట్లాడుతూ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తీరు విద్యావ్యవస్థని గాడిలో పెట్టే విధంగా లేదని, నిర్వీర్యం చేసే విధంగా ఉందని విమర్శించారు. విద్యా వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దాల్సింది పోయి వ్యవస్థ మొత్తాన్ని లోపాల పుట్టగా చూపిస్తున్నారని చిన్న చిన్న కారణాలతో ఉపాధ్యాయులను నిందించటం, మెమోలు షోకాజ్ నోటీసులు మరియు సస్పెన్షన్లతో ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తూ మొత్తం లోపమంతా ఉపాధ్యాయుల దేనని విపరీత ధోరణితో ప్రజలలో చులకన చేసేలా చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు షూస్ ధరించలేదని, యూనిఫామ్ ధరించలేదని, వర్క్ బుక్స్ పూర్తి చేయలేదని, అనేక కారణాలు చూపిస్తూ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటున్నారని , కానీ గత విద్యా సంవత్సరంలో జూన్ నుండి నవంబర్ వరకు పుస్తకాలని సరఫరా చేసిన ప్రభుత్వ లోపాన్ని గురించి మాత్రం వారు మాట్లాడరని విమర్శించారు. ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సమస్యకు పరిష్కారం కాదని చెప్తూనే అయన మాత్రం ఉపాధ్యాయులను, జిల్లా విద్యాశాఖాధికారులను సస్పెండ్లు చేస్తున్నారని విమర్శించారు.జిల్లా సెక్రటరీ జనరల్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ ప్రవీణ్ ప్రకాష్ ధోరణి వల్ల ప్రజల్లో ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. విద్యా సంబంధ విషయాలలో ఏదైనా లోపాలను గుర్తించినప్పుడు వాటిని పై అధికారిగా ఉపాధ్యాయులకు తెలియజెప్పి దాన్ని సరిదిద్దాల్సింది పోయి పూర్తి వైఫల్యం అంతా ఉపాధ్యాయులదే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తమ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఐ.మరియానందం మాట్లాడుతూ గత సంవత్సరం మొత్తంలో నాడు-నేడు అని, పాఠశాలల విలీనం అని, ప్రమోషన్లని, వర్క్ అడ్జస్ట్మెంట్లని జూన్ నుండి ఫిబ్రవరి వరకు ఒక గందరగోళ పరిస్థితి కి ఉపాధ్యాయులను గురిచేశారన్నారు. జిల్ల్వ్ కార్యదర్శి ఏళ్ళప్ప మాట్లాడుతూ ప్రతినిత్యం రక రకాల యాప్ల భారాన్ని ఉపాధ్యాయుల మీద మోపి పాఠాలు చెప్పలేని పరిస్థితి కల్పించి ఇప్పుడు విద్యా సంవత్సరం చివరిలో తనిఖీలు అంటూ హడావుడి ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఇదే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కోల్పోయిన తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించే పరిస్థితి ఉంటుందన్నారు. Fapto జిల్లా కార్యదర్శి టి.కే జనార్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి పర్యటనలు అంటూ మొత్తం విద్యావ్యవస్థని ప్రైవేటుపరం చేయడానికి, పొమ్మనకుండా పొగబెట్టిన చందంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ పర్యటనలు అర్థమని వారు పేర్కొన్నారు. ఈ విధానాన్ని మార్చుకోకపోతే ఉపాధ్యాయుల లోకాన్ని ఒత్తిడి నుండి కాపాడుకోవడం కోసం ఉద్యమించక తప్పని పరిస్థితి ఉంటుందన్నారు. అందుకు ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు.ఫ్యాప్తో జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారం వల్ల విద్యావ్యవస్థ బాగుపరచడానికా… లేక బలహీన పరచడానికా అన్నది అర్థం కావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా కోశాధికారి సేవాలాల్ నాయక్,ఈ స్మైల్ ,శాంతి ప్రియ, నాగరాజు ,నవీన్ పటేల్, మద్దిలేటి, రవి ,శ్రీనివాసులు, మురళి ,వెంకటేష్ రెడ్డి వెంకటరాముడు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరియు విరివిగా ఉపాద్యాయులు పాల్గొన్నారు.

About Author