నేడు జీలకర్రగూడెం, గుంటుపల్లి బౌద్ధరామంలో యోగాంధ్ర
1 min read
ఈనెల 21న జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమం
శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల జనరేషన్ వేగవంతం చేయాలి
రానున్న మూడు రోజులపాటు పాఠశాలల్లో యోగా కార్యక్రమాలు
జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి
పల్లెవెలుగు, ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో జూన్ 18వ తేదీన కామవరపుకోట మండలం జీలకర్రగూడెం,గుంటుపల్లి బౌద్ధరామాల వద్ద ఉదయం 6.30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు.మంగళవారం యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులు,యంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు తదితరులతో జాయింట్ కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన గుంటుపల్లి బౌద్దరామంలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రానున్న మూడు రోజులపాటు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. యోగాసనాలు శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్ల జనరేషన్ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.అదే విధంగా ఈనెల 21వతేదీ అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్బంగా జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఈనెల 21న భారీస్ధాయిలో యోగాసనాల కార్యక్రమం నిర్వహించడానికి గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో గుర్తించిన 5,053 వేదికల్లో ఆరోజు యోగాభ్యాసన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలన్నారు. ఇందుకు పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం చర్యలుతీసుకోవాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారందరిని అంతర్జాతీయ యోగా దినోత్సవంలోకి యోగాసనాల కార్యక్రమంలో పాల్గొనేలా విస్త్రృత స్ధాయిలో అవగాహన కల్పించాలన్నారు. వివిధ లొకేషన్స్ లో ప్రతిరోజు నిర్వహించే యోగా కార్యక్రమాల ఫొటోలు, అభ్యాసకుల హాజరు, డేటాను, అభ్యాసన కార్యక్రమం పూర్తయిన వెంటనే అప్ డేట్ చేయాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు జిల్లాలో ఇంతవరకు 8,60,072 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు.