PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటు కలిగి ఉండడం ప్రాథమిక హక్కు..

1 min read

– ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని ఓటు వినియోగించుకోవాలి..

– ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఓటుహక్కు పొందడమే కాకుండా దానిని వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి పిలుపునిచ్చారు.” స్వీప్ “కార్యాచరణలో భాగంగా మంగళవారం స్ధానిక సర్ సిఆర్ రెడ్డి కళాశాల నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈర్యాలీలో సర్. సిఆర్ రెడ్డి కళాశాలకు చెందిన ఎన్ సిసి యూనిట్, నేషనల్ సర్వీస్ యూనిట్, ఇతర విద్యార్ధినీ, విద్యార్దులు,పలువురు అధికారులు పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో ఓటరు నమోదు కోసం ధరఖాస్తులను అందుబాటులో ఉంచారు.   తొలుత సిఆర్ రెడ్డి కళాశాలలో విద్యార్ధులతో నిర్వహించిన స్వీప్ కార్యక్రమంలో ఓటు హక్కు విలువ, సద్వినియోగం చేసుకోవాలని ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్బంగా ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా అర్హులని వారందరూ ఫారం-6 ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.  ఓటర్ల ను చైతన్యం పర్చి రానున్న ఎన్నికలలో తప్పకుండా ఓటు హక్కు వినియోగించేలా అవగాహన కల్పిద్దామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు పవిత్రమైనదని  ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించు కోవాలని కోరారు. ఓటు వేయడానికి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరినీ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రోత్సహించి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఆవశ్యకతను తెలుసుకోనేలా యువతను ప్రభావితం చేయాలని అన్నారు.  ఓటరు నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని అన్నారు.  ప్రతి ఏడాది ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆన్ లైన్లో కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు.  కళాశాలల్లో ఓటరు నమోదు కార్యక్రమంపై మరింత అవహన కలిగించేందుకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు.జిల్లా పరిషత్ సిఇఓ కె. ఎస్.ఎస్. సుబ్బారావు మాట్లాడుతూ అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం, పటిష్టమైన రాజ్యాంగంవున్న మన దేశంలో అర్హులైన వారంతా ఓటరులుగా నమోదు కావాలన్నారు.  డిశంబరు 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ప్రతి పోలింగ్ స్టేషన్ లో నిర్వహించబడుతుందన్నారు.  అక్కడ బూత్ లెవల్ అధికారుల వద్ద సంబంధిత ధరఖాస్తులు పొంది ఓటరుగా నమోదు, చేర్పులు, మార్పులు చేసుకోవచ్చన్నారు.  కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్.సిఆర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ రామరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటే అతిబలమైన ఆయుధమని పేర్కొన్నారు.  భారత రాజ్యాంగం పౌరులకు కొన్నిహక్కులు, బాధ్యతలు కల్పించిందని ఇందులో ప్రధానంగా ఓటుహక్కు ప్రాముఖ్యతను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు.  ఓటుహక్కు వినియోగించుకుంటే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందన్నారు.   ఏలురు నగర మున్సిపల్ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది ఓటుహక్కు అని అన్నారు.  ఓటుహక్కు విలువను తెలుసుకొని అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు.  ఓటుహక్కు నమోదు, వినియోగించుకోవడంపై పెద్దఎత్తున ప్రచార అవగాహన, కార్యక్రమాలను స్వీప్ ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు.  నిజాయితీగా, నిర్బయంగా స్పేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకోవలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు తహశీల్దారు బి. సోమశేఖర్, యంపిడిఓ ప్రణవి, విద్యార్ధులు పవన్, సురేష్ తదితరులు ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరించారు.

About Author