ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ
1 min read

ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్ హర్షం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక రెవిన్యూ భవనము ఏలూరు నందు సోమవారం సమావేశము నిర్వహించడమైనది.ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా చైర్మన్ కె. రమేష్ కుమార్ హర్షం వ్యక్తం చేసారు. ఇటీవల ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వంతో ప్రభుత్వం రెండు రోజుల పాటు జరిపిన చర్చలు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచాయని పేర్కొన్నారు.గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను ఉద్యమానికి సన్నద్ధం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు నిర్వహిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి జూలై 10, 11 తేదీల్లో మంత్రుల కమిటీతో సమావేశాలు నిర్వహించడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.ఈ చర్చల్లో పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన, డీఏల విడుదల, పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు, మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ బలోపేతం, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ మరియు స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు తదితర 21 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.రానున్న ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడంతో పాటు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించాలని నిర్ణయించడం శుభపరిణామమన్నారు.ఈ కార్యక్రమములో జిల్లా జనరల్ సెక్రెటరి బి. రాంబాబు, మహిళా విభాగము చైర్ పర్సన్ శ్రీమతి గీతిక, వైస్ చైర్మన్ బి. సత్యనారాయణ, నాగేశ్వర రావు, పెన్షన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎం. మహాలక్ష్మి , డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎ. శ్రీనివాస రావు, గ్రామా వార్డ్ సచివాలయ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు కమల్, ప్రభాకర రావు వివిధ సంఘముల నాయకులూ పాల్గొన్నారు.


