గడువు పెంపు.. మిగిలిన వారు ఎన్యూమరేషన్ చేసుకోవాలి
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు, న్యూస్ నేడు : మంగళవారం భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో, ఇంకా ఎన్యూమరేషన్ పూర్తి చేయని అర్హులైన ఓటర్లందరూ వెంటనే తమ బీఎల్వోను సంప్రదించి ప్రక్రియను పూర్తిచేసుకోవాలని ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో), నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. మంగళవారం ఆయన పాత బస్టాండ్, కొత్తపేట ప్రాంతాలకు చెందిన 173, 174, 175వ పోలింగ్ కేంద్రాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గడువు పొడిగించబడిన అవకాశాన్ని ప్రతి అర్హ ఓటరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇంకా ఎన్యూమరేషన్ పూర్తి చేయని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా సంబంధిత బీఎల్వోను సంప్రదించి అవసరమైన వివరాలను సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు కొనసాగాలంటే ఎన్యూమరేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తిచేయాలని, అర్హులెవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బిఎల్వో వివరాలు తెలియకపోతే కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో ఈపిక్ నెంబర్ నమోదు చేస్తే, సంబంధింత బిఎల్వో పేరు, ఫోన్ నెంబర్ ఉంటుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏఈఆర్వో, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ ఏఈఆర్వో ప్రవీణ్ కుమార్ రెడ్డి, సూపర్వైజర్ సుహైల్, తదితరులు పాల్గొన్నారు.


