ఏలూరు నగరంలోని ప్రజలకు మెరుగైన పౌర సేవలందించేలా పనిచేయాలి
1 min read
జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఏలూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా: ఎం.జె.అభిషేక్ గౌడ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరంలోని ప్రజలకు మెరుగైన పౌర సేవలందించేలా పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఏలూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా. ఎం.జె. అభిషేక్ గౌడ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఏలూరు నగరపాలక సంస్థ లోని పలు విభాగాలను జేసీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ సమావేశపు హాలులో అధికారులతో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య విభాగం,ఇంజనీరింగ్ విభాగం పనులు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ , మెప్మా విభాగం కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా డా. అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఏలూరు నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనపడకూడదని, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైన్లలో పూడిక తీసి, వర్షాకాలంలో ముంపు ప్రమాదం లేకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు నిర్దేశించిన సమయానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రతీరోజూ ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరించేలా పర్యవేక్షించాలన్నారు. ప్రజలు రోడ్లపై చెత్తను వేయకుండా చూడాలన్నారు. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. ఏలూరు నగరంలో వర్షాకాల సమయంలో ఈదురుగాలులు సమయంలో కూలిపోయే ప్రమాదం ఉన్న హోర్డింగ్ లను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ అన్నప్రగడ భాను ప్రతాప్ అదనపు కమిషనర్ డి. శ్రీనివాస రావు, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు.



