రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో ‘యువత భవితకు భరోసా’
1 min read
“ఒక్కో యువ మేధస్సు లక్షల మందికి మార్గదర్శకం కావాలి” — ఎంపీ శ్రీ బస్తిపాటి నాగరాజు.
రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో “యువత భవితకు భరోసా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు ఎంపీ శ్రీ బస్తిపాటి నాగరాజు విద్యార్థినులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.
కర్నూలు, న్యూస్ నేడు: “ఒక్క సిరాచుక్క ఒక లక్ష మెదల్లను కదిలించినట్లుగా. ఒక లక్ష్యం ఒక జీవితాన్ని మార్చాలి.. ఒక్కో యువ మేధస్సు లక్షల మందికి మార్గదర్శకం కావాలి. మీ కలలు మీ భవిష్యత్తును మాత్రమే కాదు.. కర్నూలు భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తిగా ఎదగాలి. ఉద్యోగం కోసం ఎదురుచూసే యువతగా కాకుండా.. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే యువశక్తిగా ఎదగాలి” అని ఎంపీ బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉద్యోగ కల్పన లో భాగంగా డీఎస్సీ పరీక్షను విజయవంతంగా నిర్వహించి , కర్నూలు జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యతతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఎంపీ తెలిపారు. ఓర్వకల్లు ప్రాతాన్ని పారిశ్రామిక హబ్ గా, కర్నూలును డ్రోన్ సిటీగా, (ఎఫ్టీఓ) ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వంటి కార్యక్రమాలతో జిల్లాలో యువతకు నూతన రంగాల్లో అవకాశాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న ఆలూరు పరిసర ప్రాంత అభివృద్ధికి 1,970 కోట్ల నిధుల కేటాయింపు, గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన చర్యలు జిల్లాకు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యతను తీసుకురానున్నాయని ఎంపీ వివరించారు. హోస్పేట్ డ్యాం ఆధునికీకరణకు రూ.470 కోట్లతో 36 గేట్లను ఆధునికీకరించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిన సమన్వయ కృషిని కూడా ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యలు అమోఘం అన్నారు. వారి నిర్విరామ కృషితో మన ఆంధ్రప్రదేశ్,మన రాష్ట్ర రాజధాని అమరావతి, భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తాయన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను వివరిస్తూ “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం” పేరుతో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల గణిత ఉపాధ్యాయులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ డి. ఈశ్వరయ్య , రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి జ్యోతి పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆశావహ దృక్పథాన్ని నింపిన ఈ కార్యక్రమం యువతలో లక్ష్యసాధనకు స్ఫూర్తినిచ్చింది.


