NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా వైద్యుడికి.. పట్టం…

1 min read

సేవకు దక్కిన గుర్తింపు.. గౌరవం…

  • డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ గా  డా. పి. చంద్ర శేఖర్​ నియామకం..
  • వైద్య రంగంలో కర్నూలు ఖ్యాతి పెంచిన ఘనత ఆయనదే…
  • కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిలో..  తనదైన ముద్ర…

 “పరోపకారం ఇధం శరీరం అన్నారు పెద్దలు. పదుగురికి ఉపకరించని ఈ తనువెందుకు? నలుగురి శ్రేయస్సుకు  పాటు పడని… ఈ జన్మెందుకు…? అని తన తండ్రి నిత్యం చెప్పేవాడు.  వేలాది మందికి విద్యాదానం చేస్తున్న తన తండ్రి …దాతృత్వ భావనను చిన్ననాటి నుంచే అలవర్చుకున్న డా. పి. చంద్రశేఖర్​… ఎందరికో ఆదర్శంగా… స్ఫూర్తిగా నిలిచారు.  వైద్యరంగంలో అత్యుత్తమ సేవలు అందించి….  వేలాది మంది గుండె హృద్రోగులకు ప్రాణదాతగా నిలిచారు…. సక్సెస్​ఫుల్​ డాక్టర్​గా పేరుగాంచిన డా. చంద్రశేఖర్​ను రాష్ట్ర ప్రభుత్వం డా. ఎన్​.టి.ఆర్​. హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​గా నియమించింది. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి వైపు నిర్ణయాలు తీసుకునే ఏకైక ధీశాళి డా. చంద్ర శేఖర్ కు… అరుదైన గౌరవం, గుర్తింపు దక్కిందని ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ ( ఐఎంఏ) సభ్యులు, కర్నూలు ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.

వైద్య రంగంలో 38 ఏళ్ల అనుభవంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న డా. పి. చంద్రశేఖర్​ కు విజయాలు కొత్తేమి కాదు. అపజయాలు ఎదురైన సందర్భంలోనూ… స్థిత ప్రజ్ఞుడి’గా వ్యవహరిస్తూ..  సమయానుకూలంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ.. అందరి మన్ననలు పొందాడు.  కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అభివృద్ధిలో  తన మార్క్​ వేసుకున్నాడు.  ప్రజా వైద్యుడిగా… సక్సెస్​ ఫుల్​ డాక్టర్​ గా  పేరుగాంచారు.

కర్నూలు ( హాస్పిటల్​ ), న్యూస్​ నేడు :

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన లక్ష్మణ్​ దాస్​ యాదవ్​, సావిత్రమ్మ దంపతుల కుమారుడు డా. పి. చంద్ర శేఖర్​…. 1987 లో చిత్తూరు జిల్లా శ్రీ రంగరాజా పురం గ్రామంలోని ప్రైమరీ హెల్త్​  సెంటర్​ లో సివిల్​ అసిస్టెంట్​ సర్జన్​గా చేరి.. అక్కడ మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత  ఎస్వీ ఎంసి , తిరుపతిలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ గా ఏడేళ్లు విధులు నిర్వర్తించారు.  ఆ తరువాత కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా, అసోసియేట్​ ప్రొఫెసర్​, సూపరింటెండెంట్​, ఏడిఎంఈ,  కర్నూలు మెడికల్​ కాలేజి ప్రిన్సిపల్​ గా విధులను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన 2023లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం కార్డియాలజి విభాగంలో ప్రొఫెసర్​ గా విధులు నిర్వహిస్తున్నారు.

చంద్రశేఖరుడికి.. ఏదైనా సాధ్యమే…

పేద వాడికి కార్పొరేట్​ స్థాయిలో వైద్యం అందాలన్న కసితోనే… వైద్యవృత్తిని ఎంచుకున్నారు. 1990లో ఆరోగ్యశ్రీ లేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్​గా చేరినప్పటి నుంచి ప్రజలకు హార్ట్​ఫుల్​ గా వైద్య సేవలు అందించారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి గుండె సమస్యలతో వచ్చే రోగులకు కార్పొరేట్​ స్థాయిలో అందజేసి… లక్షల మందికి ప్రాణదాతగా నిలిచారు. లక్ష్యం సాధించారు. 

రాష్ట్ర గవర్నర్​.. అభినందన..

వైద్యరంగంలోని వివిధ శాస్ర్తవేత్తలను… భావితరాల వైద్య విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని…. స్మరించుకోవాలన్న ఉద్దేశ్యంతో కర్నూలు సర్వజన ఆస్పత్రి, మెడికల్​ కళాశాలలో దాదాపు 20 కి పైగా విగ్రహాలను ఆవిష్కరింపజేశారు. 2020లో  రాష్ట్ర గవర్నర్​ విశ్వభూషణ్​ చేతుల మీదుగా డా. అబ్దుల్​ కలాం విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఆ తరువాత  డా. చంద్రశేఖర్​ను రాష్ట్ర గవర్నర్​ అభినందించారు.

హాస్పిటల్​లో​…అభివృద్ధి ఫలాలు..

1997లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో  అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా విధులు స్వీకరించిన నాటి నుంచి ఆస్పత్రిలో అభివృద్ధి పరుగులు తీసింది. నిత్యం ఆస్పత్రి అభివృద్ధి వైపు ఆలోచించే డా. చంద్రశేఖర్​… 2000వ సంవత్సరంలో ఐసీసీయూను మంజూరు చేయించారు.  ఇప్పటికీ ఆ విభాగం సక్సెస్​ ఫుల్​గా నడుస్తోంది. అంతేకాక ఆ విభాగంలోనే క్యాథలాక్​ యూనిట్​ ఏర్పాటు చేసి.. రోగులకు యాంజియోగ్రామ్​లు, యాంజియో ప్లాస్లిలు స్టంట్స్​ వేశారు. అదేవిధంగా శిథిలమై… మూలనపడిన కార్డియో థెరాసిక్​ విభాగాన్ని  పున: ప్రారంభించారు. ప్రస్తుతం అందులో గుండె శస్ర్తచికిత్సలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

అలుపెరగని.. ప్రయాణం..

 కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రెండేళ్లపాటు  సూపరింటెండెంట్​గా విధులు నిర్వర్తించిన ఆయన… వైద్య సేవతోపాటు ఆస్పత్రి అభివృద్ధి శరవేగంగా చేశారు. ఆరు జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందించే కర్నూలు జీజీహెచ్​లో  350 కిలో వాట్ల విద్యుత్​ జనరేటర్​ను ఏర్పాటు చేయించారు. పాత భవనాలకు మరమ్మతు చేయించి… ఉపయోగంలోకి తీసుకొచ్చారు.

అత్యాధునిక టెక్నాలజీతో…ధన్వంతరి హాల్​…

పరిపాలన విభాగానికి అవసరమైన సెమినార్​ హాల్​గా ఉపయోగపడుతున్న ధన్వంతరి హాల్​ను అత్యాధునిక టెక్నాలిజీతో ఏర్పాటు చేశారు. అంతేకాక అడ్మినిస్ర్టేటివ్​ బ్లాక్​ను ఆధునికీకరించి… చిరుద్యోగులు సైతం కార్పొరేట్​ స్థాయిలో విధులు నిర్వర్తించేలా సెంట్రల్​ ఏసీని అమర్చారు.

గ్యాస్ర్టో ఎంట్రాలజీ…

ప్రభుత్వ ఆస్పత్రిలోని గ్యాస్ర్టో ఎంట్రాలజి విభాగాన్ని ఐసీయూతో ఆధునికీకరించారు. అదేవిధంగా సెంట్రల్​ ల్యాబ్​ను అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేయించారు.

ప్రిన్సిపల్​గా.. ముద్ర..

కర్నూలు మెడికల్​ కళాశాల ప్రిన్సిపల్​గా బాధ్యతలు  స్వీకరించిన డా. చంద్రశేఖర్​ … తనదైన శైలిలో అభివృద్ధి చేశారు. ఆయన హయంలో సువర్ణయుగం వచ్చిందంటూ అప్పట్లో మెడికల్​ కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు, ప్రజలు అభిప్రాయపడ్డారు. కళాశాల లోపలికి..బయటకు వెళ్లే గేట్లను మరమ్మతు చేయించారు. నూతన, పాత  ఆడిటోరియంలను ఎలక్ర్టానిక్​ పరికరాలతో అమర్చారు. మెడికల్​ ఎడ్యుకేషన్​ యూనిట్​ను ఆధునికీకరించారు.

భద్రత…నిఘా..

కళాశాల ఆవరణలో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది భద్రత దృష్ట్యా… సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు.  కోవిడ్​ సమయంలో వైద్యవిద్యార్థులందరికీ కోవిడ్​ టెస్ట్​లు చేయించిన ఘనత ఆయనకే దక్కింది.

కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​…

ప్రజాప్రతినిధులు…దాతల సహకారంతో కర్నూలు హార్ట్​ హెల్త్​ ఫౌండేషన్​ను ఏర్పాటు చేసిన కీర్తి డా. చంద్రశేఖర్​దే. ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణలో.. ఎక్కడా లేనివిధంగా  ప్రతి నెలా వైద్యం, వ్యాధులు తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వర్తిస్తున్నారు.

కర్నూలు హెల్త్ క్లబ్​…

కర్నూలు హెల్త్​ క్లబ్​ను ఏర్పాటు చేసిన డా. చంద్రశేఖర్​ .. అందులోనే జిమ్​, యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వరల్డ్​ డాక్టర్స్​ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వర్తిస్తున్నారు.

సేవలకు.. పురస్కారం..

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​, రాయచూరు, మహారాష్ట్ర నుంచి వచ్చే గుండె హృద్రోగులకు… మెరుగైన..శరవేగంగా వైద్య చికిత్సలు చేసి… ప్రాణదాతగా నిలిచిన కార్డియాలజిస్ట్​ డా. చంద్రశేఖర్​కు రెండు లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డులు వరించాయి. 2023 జూలైలో నేషనల్​ డాక్టర్స్​ డే సెలబ్రేషన్​లో భాగంగా హైదరాబాద్​ హైటెక్స్​లో లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా ఏపీసీఎస్​ఐ ఆధ్వర్యంలో లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డు బహుకరించారు.  రెండు లైఫ్​ టైమ్​ అవార్డులు అందుకున్న ఘనత ఆయనకే దక్కింది.

డా. చంద్రశేఖర్​కు అరుదైన గౌరవం..

 కరోనా ఫస్ట్​ వేవ్​లో ప్రజలకు అందించిన అత్యుత్తమ సేవలకుగాను కర్నూలు సర్వజన ఆస్ప్రతిలోని కార్డియాలజి విభాగాధిపతి డా. చంద్రశేఖర్​కు అరుదైన గౌరవం లభించింది.  ఆయనకు సర్టిఫికెట్​ ఆఫ్​ కమిట్​మెంట్​ అవార్డును వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ సంస్థ అందించింది. విపత్కర సమయంలో వైరస్​ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఎంతో ధైర్యంగా వైద్యం అందించారని సంస్థ ప్రతినిధులు కొనియాడిన విషయం తెలిసిందే.

గోల్డ్​​మెడల్​…కైవసం…

2019–20లో కోవిడ్​ విజృంభిస్తున్న సమయంలో…  కర్నూలు రెడ్​ క్రాస్​ సొసైటీలో  దాదాపు 1500 మందిని సభ్యులుగా చేర్చిన ఘనత ఆయనకే దక్కింది.​ ఆంధ్రప్రదేశ్​లోని మెడికల్​ కళాశాలలో మొత్తం మీద ఇంత పెద్ద మొత్తంలో సభ్యులుగా చేర్చిన ఆస్పత్రి కార్డియాలజి విభాగాధిపతి  డా. చంద్రశేఖర్​కు గోల్డ్​మెడల్​ దక్కడం… కర్నూలు ప్రజలకే గర్వకారణంగా నిలిచింది.

సీఎంకు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్​ స్థాయిలో వైద్యం అందించి…. లక్షల మంది పేదల గుండెకు వైద్య చికిత్సలు చేసి.. సక్సెస్​ డాక్టర్​ గా… ప్రజా వైద్యుడిగా గుర్తింపు పొందిన డా. చంద్ర శేఖర్​ కు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చిందని చెప్పవచ్చు. విజయాలు ఆయనకు కొత్తేవి కాక పోయినా…  డా. ఎన్టీఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​ గా తనకు అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, సీఎం చంద్ర బాబు నాయుడుకు, విద్యా, ఐటి శాఖ మంత్రి లోకేష్​, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. సత్య కుమార్​ యాదవ్​ కు ఈ సందర్భంగా డా. చంద్ర శేఖర్​  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *