ప్రజా వైద్యుడికి.. పట్టం…
1 min read
సేవకు దక్కిన గుర్తింపు.. గౌరవం…
- డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా డా. పి. చంద్ర శేఖర్ నియామకం..
- వైద్య రంగంలో కర్నూలు ఖ్యాతి పెంచిన ఘనత ఆయనదే…
- కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిలో.. తనదైన ముద్ర…
“పరోపకారం ఇధం శరీరం అన్నారు పెద్దలు. పదుగురికి ఉపకరించని ఈ తనువెందుకు? నలుగురి శ్రేయస్సుకు పాటు పడని… ఈ జన్మెందుకు…? అని తన తండ్రి నిత్యం చెప్పేవాడు. వేలాది మందికి విద్యాదానం చేస్తున్న తన తండ్రి …దాతృత్వ భావనను చిన్ననాటి నుంచే అలవర్చుకున్న డా. పి. చంద్రశేఖర్… ఎందరికో ఆదర్శంగా… స్ఫూర్తిగా నిలిచారు. వైద్యరంగంలో అత్యుత్తమ సేవలు అందించి…. వేలాది మంది గుండె హృద్రోగులకు ప్రాణదాతగా నిలిచారు…. సక్సెస్ఫుల్ డాక్టర్గా పేరుగాంచిన డా. చంద్రశేఖర్ను రాష్ట్ర ప్రభుత్వం డా. ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్గా నియమించింది. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి వైపు నిర్ణయాలు తీసుకునే ఏకైక ధీశాళి డా. చంద్ర శేఖర్ కు… అరుదైన గౌరవం, గుర్తింపు దక్కిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఐఎంఏ) సభ్యులు, కర్నూలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.
వైద్య రంగంలో 38 ఏళ్ల అనుభవంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న డా. పి. చంద్రశేఖర్ కు విజయాలు కొత్తేమి కాదు. అపజయాలు ఎదురైన సందర్భంలోనూ… స్థిత ప్రజ్ఞుడి’గా వ్యవహరిస్తూ.. సమయానుకూలంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ.. అందరి మన్ననలు పొందాడు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అభివృద్ధిలో తన మార్క్ వేసుకున్నాడు. ప్రజా వైద్యుడిగా… సక్సెస్ ఫుల్ డాక్టర్ గా పేరుగాంచారు.
కర్నూలు ( హాస్పిటల్ ), న్యూస్ నేడు :
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన లక్ష్మణ్ దాస్ యాదవ్, సావిత్రమ్మ దంపతుల కుమారుడు డా. పి. చంద్ర శేఖర్…. 1987 లో చిత్తూరు జిల్లా శ్రీ రంగరాజా పురం గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా చేరి.. అక్కడ మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత ఎస్వీ ఎంసి , తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఏడేళ్లు విధులు నిర్వర్తించారు. ఆ తరువాత కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్, సూపరింటెండెంట్, ఏడిఎంఈ, కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ గా విధులను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన 2023లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం కార్డియాలజి విభాగంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
చంద్రశేఖరుడికి.. ఏదైనా సాధ్యమే…
పేద వాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలన్న కసితోనే… వైద్యవృత్తిని ఎంచుకున్నారు. 1990లో ఆరోగ్యశ్రీ లేదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్గా చేరినప్పటి నుంచి ప్రజలకు హార్ట్ఫుల్ గా వైద్య సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి గుండె సమస్యలతో వచ్చే రోగులకు కార్పొరేట్ స్థాయిలో అందజేసి… లక్షల మందికి ప్రాణదాతగా నిలిచారు. లక్ష్యం సాధించారు.
రాష్ట్ర గవర్నర్.. అభినందన..
వైద్యరంగంలోని వివిధ శాస్ర్తవేత్తలను… భావితరాల వైద్య విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని…. స్మరించుకోవాలన్న ఉద్దేశ్యంతో కర్నూలు సర్వజన ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో దాదాపు 20 కి పైగా విగ్రహాలను ఆవిష్కరింపజేశారు. 2020లో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ చేతుల మీదుగా డా. అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. ఆ తరువాత డా. చంద్రశేఖర్ను రాష్ట్ర గవర్నర్ అభినందించారు.
హాస్పిటల్లో…అభివృద్ధి ఫలాలు..
1997లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు స్వీకరించిన నాటి నుంచి ఆస్పత్రిలో అభివృద్ధి పరుగులు తీసింది. నిత్యం ఆస్పత్రి అభివృద్ధి వైపు ఆలోచించే డా. చంద్రశేఖర్… 2000వ సంవత్సరంలో ఐసీసీయూను మంజూరు చేయించారు. ఇప్పటికీ ఆ విభాగం సక్సెస్ ఫుల్గా నడుస్తోంది. అంతేకాక ఆ విభాగంలోనే క్యాథలాక్ యూనిట్ ఏర్పాటు చేసి.. రోగులకు యాంజియోగ్రామ్లు, యాంజియో ప్లాస్లిలు స్టంట్స్ వేశారు. అదేవిధంగా శిథిలమై… మూలనపడిన కార్డియో థెరాసిక్ విభాగాన్ని పున: ప్రారంభించారు. ప్రస్తుతం అందులో గుండె శస్ర్తచికిత్సలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.
అలుపెరగని.. ప్రయాణం..
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రెండేళ్లపాటు సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తించిన ఆయన… వైద్య సేవతోపాటు ఆస్పత్రి అభివృద్ధి శరవేగంగా చేశారు. ఆరు జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందించే కర్నూలు జీజీహెచ్లో 350 కిలో వాట్ల విద్యుత్ జనరేటర్ను ఏర్పాటు చేయించారు. పాత భవనాలకు మరమ్మతు చేయించి… ఉపయోగంలోకి తీసుకొచ్చారు.
అత్యాధునిక టెక్నాలజీతో…ధన్వంతరి హాల్…
పరిపాలన విభాగానికి అవసరమైన సెమినార్ హాల్గా ఉపయోగపడుతున్న ధన్వంతరి హాల్ను అత్యాధునిక టెక్నాలిజీతో ఏర్పాటు చేశారు. అంతేకాక అడ్మినిస్ర్టేటివ్ బ్లాక్ను ఆధునికీకరించి… చిరుద్యోగులు సైతం కార్పొరేట్ స్థాయిలో విధులు నిర్వర్తించేలా సెంట్రల్ ఏసీని అమర్చారు.
గ్యాస్ర్టో ఎంట్రాలజీ…
ప్రభుత్వ ఆస్పత్రిలోని గ్యాస్ర్టో ఎంట్రాలజి విభాగాన్ని ఐసీయూతో ఆధునికీకరించారు. అదేవిధంగా సెంట్రల్ ల్యాబ్ను అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేయించారు.
ప్రిన్సిపల్గా.. ముద్ర..
కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన డా. చంద్రశేఖర్ … తనదైన శైలిలో అభివృద్ధి చేశారు. ఆయన హయంలో సువర్ణయుగం వచ్చిందంటూ అప్పట్లో మెడికల్ కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు, ప్రజలు అభిప్రాయపడ్డారు. కళాశాల లోపలికి..బయటకు వెళ్లే గేట్లను మరమ్మతు చేయించారు. నూతన, పాత ఆడిటోరియంలను ఎలక్ర్టానిక్ పరికరాలతో అమర్చారు. మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ను ఆధునికీకరించారు.
భద్రత…నిఘా..
కళాశాల ఆవరణలో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది భద్రత దృష్ట్యా… సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. కోవిడ్ సమయంలో వైద్యవిద్యార్థులందరికీ కోవిడ్ టెస్ట్లు చేయించిన ఘనత ఆయనకే దక్కింది.
కర్నూలు హార్ట్ ఫౌండేషన్…
ప్రజాప్రతినిధులు…దాతల సహకారంతో కర్నూలు హార్ట్ హెల్త్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసిన కీర్తి డా. చంద్రశేఖర్దే. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో.. ఎక్కడా లేనివిధంగా ప్రతి నెలా వైద్యం, వ్యాధులు తదితర వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వర్తిస్తున్నారు.
కర్నూలు హెల్త్ క్లబ్…
కర్నూలు హెల్త్ క్లబ్ను ఏర్పాటు చేసిన డా. చంద్రశేఖర్ .. అందులోనే జిమ్, యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వరల్డ్ డాక్టర్స్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వర్తిస్తున్నారు.
సేవలకు.. పురస్కారం..
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, రాయచూరు, మహారాష్ట్ర నుంచి వచ్చే గుండె హృద్రోగులకు… మెరుగైన..శరవేగంగా వైద్య చికిత్సలు చేసి… ప్రాణదాతగా నిలిచిన కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్కు రెండు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు వరించాయి. 2023 జూలైలో నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్లో భాగంగా హైదరాబాద్ హైటెక్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా ఏపీసీఎస్ఐ ఆధ్వర్యంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు బహుకరించారు. రెండు లైఫ్ టైమ్ అవార్డులు అందుకున్న ఘనత ఆయనకే దక్కింది.
డా. చంద్రశేఖర్కు అరుదైన గౌరవం..
కరోనా ఫస్ట్ వేవ్లో ప్రజలకు అందించిన అత్యుత్తమ సేవలకుగాను కర్నూలు సర్వజన ఆస్ప్రతిలోని కార్డియాలజి విభాగాధిపతి డా. చంద్రశేఖర్కు అరుదైన గౌరవం లభించింది. ఆయనకు సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్ అవార్డును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ అందించింది. విపత్కర సమయంలో వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఎంతో ధైర్యంగా వైద్యం అందించారని సంస్థ ప్రతినిధులు కొనియాడిన విషయం తెలిసిందే.
గోల్డ్మెడల్…కైవసం…
2019–20లో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో… కర్నూలు రెడ్ క్రాస్ సొసైటీలో దాదాపు 1500 మందిని సభ్యులుగా చేర్చిన ఘనత ఆయనకే దక్కింది. ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కళాశాలలో మొత్తం మీద ఇంత పెద్ద మొత్తంలో సభ్యులుగా చేర్చిన ఆస్పత్రి కార్డియాలజి విభాగాధిపతి డా. చంద్రశేఖర్కు గోల్డ్మెడల్ దక్కడం… కర్నూలు ప్రజలకే గర్వకారణంగా నిలిచింది.
సీఎంకు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించి…. లక్షల మంది పేదల గుండెకు వైద్య చికిత్సలు చేసి.. సక్సెస్ డాక్టర్ గా… ప్రజా వైద్యుడిగా గుర్తింపు పొందిన డా. చంద్ర శేఖర్ కు రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చిందని చెప్పవచ్చు. విజయాలు ఆయనకు కొత్తేవి కాక పోయినా… డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా తనకు అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, సీఎం చంద్ర బాబు నాయుడుకు, విద్యా, ఐటి శాఖ మంత్రి లోకేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. సత్య కుమార్ యాదవ్ కు ఈ సందర్భంగా డా. చంద్ర శేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.