అక్రమ ఫీజులకు పాల్పడుతున్న ఎస్టీ జోసెఫ్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: అక్రమ ఫీజులు పుస్తకాల వ్యాపారానికి పాల్పడుతున్న స్థానిక ఎస్టీ జోసెఫ్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ మాట్లాడుతూ, వివిధ రూపాలలో తల్లిదండ్రుల నుండి అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నారని అలాగే పుస్తకాలను వ్యాపారం గా మలుచుకొని లాభాలు గడిస్తున్నారని ఆరోపించారు. పత్తికొండ ఎస్టి జోసెఫ్ స్కూల్లో ఏఐఎస్ఎఫ్ నాయకులు తనిఖీ చేయగా విద్యార్థులు ఫీజు కడితేనే పుస్తకాలు ఇస్తామని లేకపోతే ఇవ్వమని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఎస్టి జోసెఫ్ యాజమాన్యం ఇబ్బందికి గురి చేస్తుందని ఆయన అన్నారు. ఈ విషయమై స్థానిక ఎంఈఓ లకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడంలేదని అన్నారు. ఇప్పటికైనా ఎస్టీ జోసెఫ్ స్కూల్లో వసూలు చేస్తున్న అధిక ఫీజులు అక్రమ పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలని వారు ఈ సందర్భంగా కోరారు. అక్రమ ఫీజులు వసూళ్లు, పుస్తకాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న స్థానిక ఎస్టీ జోసెఫ్ హై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను కోరారు. అలాగే పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల అక్రమ ఫీజులకు దందాను నిలువరించాలని సూచించారు. ముందు ముందు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఆర్డిఓ భరత్ నాయక్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రవి చరణ, కేశవ, దశరథ, ఇర్ఫాన్, గణేష్, సుధాకర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి అల్తాఫ్ హుస్సేన్, పట్టణ ఉపాధ్యక్షులు నజీర్ భాషా తదితరులు పాల్గొన్నారు.