రైతులందరూ జూలై 31లోపు పంటల బీమాలో నమోదు చేసుకోవాలి – ఆనంద్ లోక్ దళ్
1 min read
ఖరీఫ్–2026 వాతావరణ ఆధారిత పంటల బీమా గడువు పొడిగింపు నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించిన జిల్లా నాయకులు
హోళగుంద న్యూస్ నేడు: ఖరీఫ్–2026 వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (RWBCIS) కింద లోనీ, నాన్-లోనీ రైతుల నమోదు గడువును ప్రభుత్వం ఈ నెల 31-07-2026 వరకు పొడిగించిన నేపథ్యంలో, అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆనంద్ లోక్ దళ్ కర్నూలు జిల్లా నాయకులు విజ్ఞప్తి చేశారు.ఇప్పటి వరకు పంటల బీమాలో నమోదు చేసుకోని రైతులు సంబంధిత బ్యాంకు లేదా కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) ద్వారా జూలై 31లోపు తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం లేదా అధిక వర్షాల వల్ల కలిగే నష్టాల నుంచి రైతులకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.అయితే, జూలై 16 నుంచి జూలై 31 మధ్య నమోదు చేసుకునే రైతులకు బీమా రక్షణ ఆగస్టు 1, 2026 నుంచి మాత్రమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. అలాగే జూలై 1 నుంచి జూలై 31 వరకు సంభవించిన వాతావరణ నష్టాలకు బీమా రక్షణ లేదా క్లెయిమ్ వర్తించదని రైతులు గమనించాలని సూచించారు.చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే నమోదు పూర్తి చేసుకుని పంటల బీమా రక్షణను పొందాలని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆనంద్ లోక్ దళ్ నాయకులు కోరారు.



