సచివాలయ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉంది
1 min read
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలయ్యేందుకు కృషి చేసేది సచివాలయ ఉద్యోగులే
ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు వారథులుగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలయ్యేందుకు పాటుపడుతోన్న సచివాలయాల ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వమెప్పుడూ సానుకూల దృక్ఫథాన్నే కనపరుస్తూ వచ్చిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాదికాలంలో కూటమి పాలనలోప్రభుత్వం ఉద్యోగులపక్షపాత నిర్ణయాలనెన్నింటినో అమలుచేస్తూ వచ్చిందని స్పష్టం చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం సడలింపునిచ్చింది. దీనికి సంబంధించి సోమవారం జిఓ ఎంఎస్ నెంబరు 6ను విడుదల చేసింది. ఇంతకుముందు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీకి సొంత మండలాన్నిపరిగణనలోకి తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ల నుంచి వచ్చిన వినతుల మేరకు పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంతవార్డు కాకుండా అదే పట్టణ పరిధిలోని ఇతర వార్డుల్లోకి బదిలీలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరణలతో సంతోషం వ్యక్తం చేసిన ఏలూరు పరిధిలోని వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తోన్న ఉద్యోగులు కృతజ్ఞతాపూర్వకంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన అనేక నిర్ణయాలను ఈ ఏడాదికాలంలో అమలు చేసినట్లు చెప్పిన పథకాల అమలును మరింత సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా శ్రద్దవహించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా రీజనల్ కో – ఆర్డినేటర్, సచివాలయ ఉద్యోగుల జేఏసి ఛైర్మన్ జీ.వి.ఎస్ శ్రీనివాస్, జేఏసి జనరల్ సెక్రెటరీ దుర్గాప్రసాద్, ట్రెజరర్ రెడ్డి ఛైతన్య, ప్రసన్న, సునీత, అబ్రహాం,హర్ష,జ్యోతి, షాహిద్ తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు.