తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి సహకరించండి
1 min read
జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్
నంద్యాల, న్యూస్ నేడు : జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పటిష్టం చేయడంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు కీలకమని జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ… తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహాయ సహకారాలు అందజేయాలన్నారు. ఓటర్ల జాబితాలోని మృతులు, మార్పులు, చేర్పులను బూతు స్థాయి ఏజెంట్లతో పరిశీలించుకుని అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఈఆర్ఓ, ఏఆర్ఓలకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి సమావేశంలో చర్చించారు.అనంతరం సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ… గత సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేసిన హోమ్ ఓటింగ్ శాతాన్ని ఇంకా పెద్ద ఎత్తున అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ లో గెజిటెడ్ అధికారి సంతకం, జిల్లాలో గిరిజనలు, చెంచు జనాభా ఎక్కువగా ప్రాంతాల్లో వారికి ఓటింగ్ పై చైతన్యం కల్పించడం, మృతులు, డూప్లికేట్ ఓటర్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు సూచించిన అంశాలను ఎన్నికల సంఘానికి నివేదిస్తామని డిఆర్ఓ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్నిక విభాగ సూపరింటెండెంట్ జయ ప్రసాద్, ఇంచార్జి ఎఓ సుభాకర్, బీఎస్పీ పార్టీ ప్రతినిధి కొట్టం శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సయ్యద్ రియాజ్ బాషా, టిడిపి పార్టీ ప్రతినిధి కె.శివరాం రెడ్డి, వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతినిధి సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.